ఆర్నాబ్ ను అరెస్టు అయ్యేలా చేసిన కేసు ఏమిటి?

తన మాటలతో.. దూకుడుతనంతో భారతదేశం మొత్తం గుర్తింపు పొందిన జర్నలిస్టు దిగ్గజం ఆర్నాబ్ గోస్వామి ఈ ఉదయం పోలీసులు అరెస్టు చేయటం తెలిసిందే. దాదాపు రెండేళ్ల క్రితం జరిగిన ఆత్మహత్య కేసులో.. ఆయన కారణంగానే అదంతా జరిగిందన్నఆరోపణలతో ఆయన్ను అరెస్టు చేశారు. అధికారంలో ఉన్న వారితో పెట్టుకుంటే.. ఎవరైనా సరే.. తమకున్నపవర్ ను చూపించే ప్రభుత్వాధినేతలకు కొనసాగింపుగా తాజా చర్యను చూడాలి. తమను.. తమ ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేయటంతో పాటు.. తన చానల్ వేదికగా.. ఆర్నాబ్ ప్రదర్శించే దూకుడుతనం శివసేన సీఎంకు ఏ మాత్రం నచ్చకపోవటం తెలిసిందే.

ఈ కారణంతోనే కావొచ్చు.. సేన సర్కారు మార్కు కనిపించేలా ఆర్నాబ్ అరెస్టు ఉందన్న మాట వినిపిస్తోంది. ఒక కేసులో నిందితుడ్ని.. అది కూడా ఒక రంగంలో ప్రముఖుడిగా పేరున్న వ్యక్తిని అరెస్టు చేసే వేళలో.. జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లాల్సిన అవసరం ఉందా? వాహనంలోకి నెట్టాల్సిన పనేమిటి? అన్నవి ప్రశ్నలు. వ్యవస్థలోని రెండు రంగాల మధ్య విభేదాలు వస్తే.. వాటిని ఆయా రంగాల వేదికల మీద బదులు తీర్చుకోవటం బాగుంటుంది.కానీ.. వ్యక్తిగత స్థాయిలోకి వెళితే ఎలా ఉంటుందన్నది ఆర్నాబ్ గోస్వామి అరెస్టు ఉదంతం చెప్పకనే చెబుతుంది.

చట్టాలు ఎన్ని ఉన్నా.. నేరారోపణ సమయంలోనే తీర్పులు చెప్పేస్తున్న రీతిలో పోలీసులు వ్యవహరించే తీరు ఏ మాత్రం సరికాదన్నది మర్చిపోకూడదు. అరెస్టు వేళ.. ఆర్నాబ్ ఇంట్లో జరిగిన పరిణామాలు దీనికి నిదర్శనంగా చెప్పక తప్పదు. ఇంతకీ ఆర్నాబ్ గో స్వామి అరెస్టుకు కారణమైన ఉదంతం ఏమిటి? అదెప్పుడూ చోటు చేసుకుంది? ఆయన మీద ఉన్న ఆరోపణలు ఏమిటి? అన్న వివరాల్లోకి వెళితే..

రిపబ్లిక్ టీవీ స్టూడియోలను రూపొందించిన ఇంటీరియర్ డిజైర్ అన్వే నాయక్ కు బిల్లులు చెల్లించలేదు. దీనికి కారణం ఏమిటన్న విషయం బయటకు రాలేదు. తనకు చెల్లించాల్సిన బిల్లు మొత్తాన్ని చెల్లించకుండా అదే పనిగా తిప్పుతున్న వైనంతో.. సదరు ఇంటీరియర్ డిజైనర్ అన్వే.. అతని తల్లి కుముద్ నాయక్ లు 2018 మేలో అలీబాగ్ లోని వారి బంగ్లాలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. రిపబ్లిక్ టీవీ సకాలంలో బిల్లులు చెల్లించకపోవటంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లుగా కుటుంబ సభ్యులు ఆరోపించటంతో అర్నాబ్ మీద రాయ్ గడ్ లో కేసు నమోదైంది.

అయితే.. సూసైడ్ నోట్ లో పేర్కొన్నట్లుగా నిందితులపై తమకు ఆధారాలు దొరకలేదంటూ 2019లో ఈ కేసును మూసేశారు. ఈ ఏడాది మేలో అన్వే కుమార్తె ఈ కేసుపై తిరిగి దర్యాప్తు చేయాలని కోరుతూ తెర మీదకు వచ్చారు. అదే సమయంలో ఆర్నాబ్ వర్సెస్ శివసేన సర్కారుకు మధ్య లడాయి నడుస్తున్న వేళలో.. తాజా పరిణామాలు చోటు చేసుకున్నట్లుగా వాదనలు వినిపిస్తున్నాయి.