అభివృద్ధి-సంక్షేమం రెండు కళ్లుగా దూసుకుపోతున్న కూటమి ప్రభుత్వానికి పంటి కింద రాళ్ల మాదిరిగా విపత్తులు-వివాదాలు ముసురుకుంటున్నాయి. పది మాసాల పాలనలో ఎదురైన అనుభవాలను చూస్తే.. ఆయా విపత్తులు.. సర్కారుకు పెను సవాలుగానే పరిణమించాయని చెప్పక తప్పదు. అయినప్పటికీ కూటమి ప్రభుత్వం దూకుడుగా ముందుకు సాగుతోంది. ప్రబుత్వం ఏర్పడిన కొత్తలో గత ఏడాది సెప్టెంబరులో విజయవాడను బుడమేరు ముంచేసింది. దీంతో వేలాది కుటుంబాలు నీట చిక్కుకున్నాయి.
దీంతో స్వయంగా రంగంలోకి దిగిన సీఎం చంద్రబాబు.. రోజుల తరబడి విజయవాడలోనే మకాం వేసి.. బాధితులను స్వయంగా వరద నీటిలోనే వెళ్లి పరామర్శించి.. వారికి సాయం చేశారు. రాత్రికి రాత్రి వరద బాధితులను ఆదుకునేందుకు ప్రయత్నం చేశారు. ఈ కష్టం నుంచి బయటకు వచ్చే సరికి.. ఏలూరులోని ఎర్రకాలువ పొంగింది. దీంతో అక్కడ వేలాది ఎకరాల్లో పొలాలు నీట మునిగాయి. దీంతో ఇబ్బందులు తప్పలేదు. ఇక, ఆ తర్వాత.. విశాఖ, కాకినాడల్లోని ఫార్మా కంపెనీల్లో.. తలెత్తిన ఘటనల్లో పలువురు చనిపోయారు.
ఇక, ఈ ఏడాది మొదట్లో.. తిరుమల వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శ్రీవారిని దర్శించుకునేందుకు టికెట్ తీసుకునే క్రమంలో తలెత్తిన తొక్కిసలాటలో పలువురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఇది తీవ్ర వివాదం రేపింది. దీనికి ముందు లడ్డూ ప్రసాదం కల్తీ కూడా.. సర్కారును ఉక్కిరి బిక్కిరికి గురి చేసింది. ఇటీవల తూర్పుగోదావరిలో బాణా సంచా పేలుడు కారణంగా.. సుమారు 8 మంది వరకు మృతి చెందారు. ఇలా.. ఒక్కొక్క ఘటన సర్కారును ఇరుకున పెట్టాయి.
తాజాగా సిహాచలంలో రూ.300 టికెట్ల దర్శన కౌంటర్ వద్ద గోడ కూలిన ఘటన లో 8 మంది చనిపోయారు. మరింత మంది గాయపడ్డారు. వీరికి కూడా ఇప్పుడు రూ.25 లక్షల మేరకు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. పైగా.. ఇది రాజకీయ వివాదాలకు కూడా దారితీసింది. వైసీపీ హయాంలో నిర్మించిన గోడ కారణంగానే ఇది జరిగిందని మంత్రి అనిత వంటి వారువ్యాఖ్యానించడం గమనార్హం. దీనిపై ఏం జరుగుతుందో చూడాలి. ఏదేమైనా.. కూటమి సర్కారుకు విపత్తులు- వివాదాలు ఇబ్బందికరంగా మారాయనే చెప్పాలి.