మూడు మెగా పరిశ్రమలకు గ్రీన్ సిగ్నల్

రాష్ట్రంలో కొత్తగా మూడు మెగా పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విశాఖపట్నం, చిత్తూరు, తూర్పుగోదావరి జిల్లాల్లోని సెజ్ లలో పరిశ్రమల ఏర్పాటుకు వివిధ యాజమాన్యాలు రెడీగా ఉన్నాయి. యాజమాన్యాలు, పెట్టుబడులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిటిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చర్చించిన అంశాల ప్రకారం సుమారు రూ. 16,314 వేల కోట్ల పెట్టుబడులు రానున్నట్లు తెలిసింది. సుమారు ఆరు పరిశ్రమల ఏర్పాటు ద్వారా 39 వేలమందికి ఉద్యోగ, ఉపాధి ఖాయమని సమావేశం అభిప్రాయపడింది.

చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి మండలంలోని ఇనగలూరు గ్రామంలో అపాచీ సంస్ధకు చెందిన ఇంటెలిజెంట్ సెజ్ లిమిటెడ్ లో చెప్పుల తయారీ యూనిట్ ఏర్పాటు కాబోతోంది. రూ. 700 కోట్ల పెట్టుబడితో రాబోతున్న ఈ సంస్ధలో సుమారు 10 వేలమందికి ఉద్యోగాలు రానున్నాయి. ఇదే సంస్ధ కడపజిల్లాలో కూడా మరో యూనిట్ ఏర్పాటు ద్వారా 2 వేలమందికి ఉద్యోగవకాశాలు కల్పించనున్నది.

విశాఖపట్నం జిల్లాలోని అచ్చుతాపురం సెజ్ లో ఏటీసీఏపి ప్రైవేటు లిమిటెడ్ ఆధ్వర్యంలో హైబ్రీడ్ టైర్ల యూనిట్ ఏర్పాటు చేయబోతోంది. రూ. 980 కోట్లతో ఏర్పాటు కాబోతున్న యూనిట్ ద్వారా 2 వేలమందికి ఉద్యోగాలు రానున్నాయి. విశాఖలోనే ఉన్న మధురవాడ సెజ్ లో అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో డేటా సెంటర్, బిజినెస్ పార్క్, రిక్రియేషన్ సెంటర్ తదితరాలను రూ. 14634 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. తన యూనిట్ల ద్వారా అదానీ కంపెనీ 24990 మందికి ఉపాధి, ఉద్యోగాలు రాబోతున్నాయి.

ఇక తూర్పుగోదావరి జిల్లాలో బిర్లా గ్రూపుకు చెందిన గ్రాసిమ్ ఇండస్ట్రీస్, చెన్నై రైల్ కోచ్ తయారీ యూనిట్, గ్రీన్ ల్యాండ్ ప్లైవుడ్ తయారీ యూనిట్లు ఏర్పాటుకు ఆయా కంపెనీలు ముందుకొచ్చాయి. అవి అందించిన ప్రతిపాదనలపైన కూడా సమావేశం చర్చించింది. పరిశ్రమల యాజమాన్యాలు ఆశిస్తున్న ఇన్సెంటివ్ ల పై చర్చించాలని జగన్ ఉన్నతాధికారులను ఆదేశించారు. యాజమన్యాలతో వీలైనంత తొందరలో చర్చలు జరిపి ఒప్పందాల ప్రకారం యూనిట్లు గ్రౌండ్ అయ్యేట్లు చూడాలని జగన్ స్పష్టంగా చెప్పారు.