మద్యం కుంభకోణం: అందరూ జగన్ పేరే చెబుతున్నారు?

Andhra Pradesh

ఏపీలో వైైసీపీ జమానాలో చోటుచేసుకున్న మద్యం కుంభకోణం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన పాత్రధారులుగా పరిగణిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వారి అరెస్టుల సందర్భంగా కోర్టులకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పలు ఆసక్తికర అంశాలు ఉన్నాయి. ఈ కుంభకోణం వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగిందని… కుంభకోణంలో వసూలు అయిన ముడుపులు కూడా చివరకు ఆయన వద్దకే చేరాయని తేలింది. ఈ మేరకు నంద్యాల కేంద్రంగా ఉన్న ఎస్పీవై ఆగ్రోస్ అధినేత సజ్జల శ్రీధర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో సిట్ ఈ విషయాలను బయటపెట్టింది.

మద్యం కుంభకోణం మాస్టర్ మైండ్ కసిరెడ్డి రాజశేఖరరెడ్డి, ఆయన తోడల్లుడు చాణక్యను అరెస్టు చేసిన సిట్… వారిచ్చిన సమాచారం మేరకు సజ్జల శ్రీధర్ రెడ్డిని శుక్రవారం రాత్రి హైదరాబాదులో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శ్రీధర్ రెడ్డిని సమగ్రంగా విచారించిన సిట్ అధికారులు…విచారణలో వెలుగుచూసిన అంశాల ఆధారంగా రిమాండ్ రిపోర్టు రూపొందించారు. ఇందులోనే మద్యం కుంభకోణం మొత్తం నాటి సీఎం జగన్ కనుసన్నల్లోనే జరిగిందని, ముడుపులు చివరాఖరుకు వైసీపీ ఖాతాల్లోకే చేరాయని ఓ నిర్ధారణకు వచ్చింది. కసిరెడ్డి మాదిరిగానే శ్రీధర్ రెడ్డి కూడా కుంభకోణంలో కీలకంగా వ్యవహరించారు. మద్యం తయారీదారుల నుంచి కమీషన్ల నిర్ణయం, వసూలు, లంచం ఇవ్వని కంపెనీలను దూరం పెట్టడం, మద్యాన్ని తన కంపెనీకి తరలించి నాణ్యతలో మార్పు చేయడం.. ఇలా దాదాపుగా అన్ని కార్యకలాపాలు కూడా శ్రీధర్ రెడ్డి నేతృత్వంలోనే జరిగాయి.

ఇక అందరూ అనుమానిస్తున్నట్లుగా జగన్ కు ఈ కుంభకోణానికి సంబంధం కూడా తాజాగా బయటపడిపోయింది. జగన్ ఆదేశాలతోనే ఈ దందాకు తాము రూపకల్పన చేశామని, వ్యూహం రచించాక దానిని జగన్ ముందు పెట్టగా… ఆయన అనుమతితోనే ఈ వ్యవహారాన్ని నిరాఘాటంగా నడిపించామని శ్రీధర్ రెడ్డి చెప్పారు. మద్యం కుంభకోణానికి మొత్తం ప్రణాళిక రచించిన తర్వాత ఆ ప్రణాళికను చూసిన జగన్… ప్రణాళికకు మూల స్తంభంగా నిలిచిన మద్యం పాలసీపై జీవో ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ వ్యవహారంలో తమకు ఎక్కడా ఆటంకాలు ఎదురుకాకుండా ఉండేలా కేంద్ర సర్వీసుల్లో ఉన్న వాసుదేవరెడ్డిని ఏపీబీసీఎల్ ఎండీగా నియమించి…తమ మాట వింటారన్న భావనతో సత్యప్రసాద్ ను ఏపీబీసీఎల్ స్పెషల్ ఆఫీసర్లుగా అపాయింట్ చేశారని తెలిపారు. వీరిద్దరి సహకారంతో మద్యం కుంభకోణం ఐదేళ్ల పాటు నిరాఘాటంగా సాగిందని వెల్లడించారు.

ఇక వైసీపీ అదికారంలో ఉన్నంత కాలం మద్యం కుంభకోణం యథేచ్ఛగా సాగిపోగా… కూటమి సర్కారు రావడంతోనే బ్రేకులు పడిపోయాయి. లేదంటే… ఇదే మద్యం కుంభకోణం మరింత కాలం పాటు కొనసాగేది. జగన్ కు మరిన్నివేల కోట్ల నిధులు అంది ఉండేవి. ఈ మద్యం సిండికేట్ ఓ వ్యవస్థగా మారిపోయేది. సజ్జల శ్రీధర్ రెడ్డి ఎస్పీవై ఆగ్రోస్ ను మరింతగా విస్తరించి ఉండేవారు. ఇక్కడ మరో కీలక అంశాన్ని కూడా చెప్పుకోవాలి. మద్యం నాణ్యతను మార్చేందుకు ఎస్పీవై ఆగ్రోస్ కేంద్రంగా మారగా… అప్పటికే దాదాపుగా మూతపడ్డ ఆ కంపెనీని తెరిచేందుకు అరబిందో నుంచి జగన్ ఆదేశాలతో శ్రీధర్ రెడ్డి రూ.45 కోట్లు తీసుకున్నారు. అయితే ఈ రుణంలో శ్రీధర్ రెడ్డికి రూ.38 కోట్లు మాత్రమే అందగా… మిగిలిన రూ.7 కోట్లతో రూ.5 కోట్లు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి, మిగిలిన రూ.2 కోట్లు ఇతర వైసీపీ నేతలకు ముడుపులుగా ముట్టాయట. అప్పు ఇప్పించడంలోనూ కమీషన్లు దండుకున్న వైనాన్ని శ్రీధర్ రెడ్డి బయటపెట్టారు.