వారికిచ్చారు స‌రే.. మాప‌రిస్థితేంటి? టీడీపీలో ర‌గులుకున్న పోరు!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీని ఒక స‌మ‌స్య వ‌దిలితే.. మ‌రో స‌మ‌స్య వెంటాడుతోంది. నిన్న‌మొన్న‌టి వ‌రకు నాయ‌క‌త్వ స‌మ‌స్య‌లు వెంటాడాయి. నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇంచార్జుల అంశాలు కూడా పార్టీని ఇబ్బంది పెట్టాయి. వీటిని స‌రిచేసే క్ర‌మంలోనే పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గాల వారీగా ఇంచార్జ్‌ల‌ను నియ‌మించారు. అదే స‌మయంలో పార్టీలో స్టేట్ క‌మిటీని ఏర్పాటు చేశారు.. ప‌ద‌వులు ఇచ్చారు. బీసీల‌కు ప్రాధాన్యం పెంచారు. ఇంత‌వ‌ర‌కు బాగుంది. అయితే.. ఇప్పుడు సామాజిక వ‌ర్గాల వారీగా చూస్తే.. త‌మ‌కు అన్యాయం జ‌రిగింద‌ని.. త‌మ‌కు అస‌లు గుర్తింపే లేకుండా పోయింద‌ని పేర్కొంటూ.. కొంద‌రు నేత‌లు చంద్ర‌బాబుకు లేఖ‌లు రాయ‌డం గ‌మ‌నార్హం.

తాజాగా టీడీపీ సీనియ‌ర్ల మ‌ధ్య చ‌ర్చ‌కు వ‌చ్చిన ఈ అంశంపై చ‌ర్చ జ‌రుగుతోంది. పార్టీ అధికారంలో ఉన్న స‌మ‌యంలో ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చంద్ర‌బాబు ప్రాధాన్యం ఇచ్చారు. ఎస్సీల్లోని మాల‌, మాదిగ సామాజిక వ‌ర్గాల‌కు స‌మాన ప్రాధాన్యం ఇచ్చారు. మాదిగ సామాజిక వ‌ర్గానికి చెందిన కేఎస్ జ‌వ‌హ‌ర్‌కు మంత్రి ప‌ద‌వి ఇస్తే.. అదే జిల్లాలోని మాల సామాజిక వ‌ర్గానికి చెందిన పీత‌ల సుజాత‌కు కూడా మంత్రి ప‌ద‌వి ఇచ్చారు. అదేస‌మ‌యంలో పార్టీ అధికార ప్ర‌తినిధిగా మాదిగ సామాజిక వ‌ర్గానికి చెందిన వ‌ర్ల రామ‌య్య‌ను నియ‌మిస్తే.. ఎస్సీ కొర్ప‌రేస‌న్ చైర్మ‌న్‌, ఫైనాన్స్ కొర్ప‌రేస‌న్ చైర్మ‌న్‌ప‌దవుల‌ను మాల వ‌ర్గానికి చెందిన కారెం శివాజీ, జూపూడి ప్ర‌భాక‌ర్‌ల‌కు అప్ప‌గించారు.

అధికారంలో ఉన్న స‌మ‌యంలో ఈ రెండు వ‌ర్గాల‌ను స‌మానంగా ఆద‌రించిన చంద్ర‌బాబు.. ఎక్క‌డా విమ‌ర్శ‌లు ఎదుర్కొన‌లేదు. అయితే.. ఇప్పుడు పార్టీ ప‌ద‌వుల్లో త‌మ‌కు అన్యాయం జ‌రిగింద‌ని.. మాల సామాజిక వ‌ర్గం గ‌గ్గోలు పెడుతోంది. ఇటీవ‌ల ఇచ్చిన పార్టీ ప‌ద‌వుల్లో త‌మ‌కు ఎలాంటి ప్రాధాన్యం లేకుండా పోయింద‌ని.. ఈ వ‌ర్గానికి చెందిన నాయ‌కులు.. చంద్ర‌బాబుకు లేఖాస్త్రాలు సంధించారు. జ‌వ‌హ‌ర్‌కు రాజ‌మండ్రి పార్ల‌మెంట‌రీ జిల్లా ప‌గ్గాలు ఇచ్చారు. వ‌ర్ల‌కు.. పార్టీ పొలిట్ బ్యూరోలో చోటు క‌ల్పించారు. అదేవిధంగా మాదిగ వ‌ర్గానికి చెందిన ఎం.ఎస్‌రాజుకు టీడీపీ ఎస్సీసెల్ అధ్య‌క్ష ప‌గ్గాలు అప్ప‌గించారు.

ఇక‌, మాజీ ఎమ్మెల్యే మాదిగ వ‌ర్గానికి చెందిన వంగ‌ల‌పూడి అనిత‌కు ఏకంగా రెండు ప‌ద‌వులు ఇచ్చారు.తెలుగు మ‌హిళ అధ్య‌క్షురాలు స‌హా పార్టీలో కీల‌క ప‌ద‌వి ఇచ్చారు. కానీ, మాల వ‌ర్గానికి మాత్రం ప‌దవులు ఇవ్వ‌లేద‌ని వారు ఆరోపిస్తున్నారు. మ‌రీ ముఖ్యంగా మాజీ మంత్రి పీత‌ల సుజాత‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డం, మాజీ స్పీక‌ర్‌.. ప్ర‌తిభా భార‌తికి పొలిట్ బ్యూరో స‌భ్య‌త్వం తొల‌గించ‌డం.. వంటివి పార్టీలో త‌మ‌కు ప్రాధాన్యం లేకుండా చేస్తున్నారనేందుకు నిద‌ర్శ‌నాల‌నిఆ వ‌ర్గం వారు చంద్ర‌బాబు లేఖలు సంధించిన‌ట్టు తెలుస్తోంది. మ‌రి ఈ అసంతృప్తిని బాబు ఎలా చ‌ల్లార్చుతారో చూడాలి.