300 కోట్ల‌కు బురిడీ కొట్టించిన వైసీపీ బుట్టా..

వైసీపీ నాయ‌కురాలు, క‌ర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుక‌.. ఓ ఆర్థిక సంస్థ‌ను బురిడీ కొట్టించారు. 310 కోట్ల రూపాయల‌ను అప్పుగా తీసుకున్న ఆమె.. దీనిల కేవ‌లం 40 కోట్లు మాత్ర‌మే చెల్లించారు. మిగిలిన మొత్తం చెల్లింపు విష‌యంలో జాప్యం చేయ‌డంతోపాటు.. స‌ద‌రు రుణ సంస్థ‌ను ముప్పు తిప్ప‌లు పెట్టారు. దీంతో ఆస్తుల వేలం ప్ర‌క్రియ వ‌ర‌కు .. విష‌యం వ‌చ్చేసింది. అయితే.. వెనుక వైసీపీ జెండా ఉండ‌డంతో స‌ద‌రు ఆస్తుల‌ను వేలంలో ద‌క్కించుకునేందుకు ఎవ‌రూ ముందుకు రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

ఏం జ‌రిగింది?

వైసీపీ నాయకురాలైన బుట్టా రేణుక‌, ఆమె భ‌ర్త నీల‌కంఠం.. వ్యాపార వేత్త‌లు. హైద‌రాబాద్‌, క‌ర్నూలులో వారికి విద్యాసంస్థ‌లు ఉన్నాయి. వీటితోపాటు.. స్పిన్నింగ్ మిల్లులు కూడా ఉన్నాయి. ఈ క్ర‌మంలో మ‌రో సంస్థ‌ను కూడా ఏర్పాటు చేశారు. బుట్టా ఇన్‌ఫ్రాస్ట‌క్చ‌ర్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కొత్త సంస్థ‌ను స్థాపించి.. దీనికిగాను.. ఎల్ఐసీ అనుబంధ రుణ సంస్థ హెచ్ ఎఫ్ ఎల్ నుంచి ఆరేళ్ల కింద‌ట(బుట్టా ఎంపీగా ఉన్న స‌మ‌యంలో) 310 కోట్లు రుణంగా తీసుకున్నారు.

అయితే.. ఈ సొమ్మును అస‌లు సంస్థ‌తో పాటు.. ఇత‌ర సంస్థ‌ల‌కు కూడా స‌ర్దుబాటు చేశారు. ఇక‌, 2019 ఎన్నిక‌ల్లో టికెట్ ద‌క్క‌క‌పోవ‌డంతో పాటు.. ఇత‌ర కార‌ణాల‌తో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ప‌రిణామాల‌తో వ్యాపారాలు దెబ్బ‌తిని.. అప్పులు ఎగ్గొట్ట‌డం ప్రారంభించిన‌ట్టు ఆర్థిక సంస్థ హెచ్ ఎఫ్ ఎల్ పేర్కొంది. ప‌లు మార్లు అవ‌కాశం ఇచ్చినా.. ప‌ట్టించుకోలేదు. దీంతో ఏడాది కింద‌టే.. నేష‌న‌ల్ లా ట్రైబ్యున‌ల్‌ను ఆశ్ర‌యించి.. ఆస్తులు వేలం వేసుకునేందుకు అనుమ‌తి తెచ్చుకున్నారు.

ఈ క్ర‌మంలో బంజారాహిల్స్‌, మాదాపూర్‌ల‌లోని బుట్టా ఫ్యామిలీకి ఉన్న ఆస్తుల‌ను ఇప్ప‌టికే ఒక‌సారి వేలం వేయ‌గా.. ఎవ‌రూ ముందుకు రాలేదు. తాజాగా మ‌రోసారి వేలం ప్ర‌క‌ట‌న ఇచ్చారు. మ‌రి దీనికైనా స్పంద‌న ల‌భిస్తుందో లేదో చూడాలి. ఇదిలావుంటే.. వైసీపీ నేప‌థ్యం ఉన్న కార‌ణంగానే బుట్టా ఆస్తుల‌ను కొనుగోలు చేసేందుకు ఎవ‌రూ ముందుకు రావ‌డం లేద‌ని స‌మాచారం. కాగా.. ఇప్పుడు వ‌డ్డీతో స‌హా బుట్టా రూ.340 కోట్ల వ‌ర‌కు ఆర్థిక సంస్థ‌కు చెల్లించాల్సి ఉంది.