అనుకున్నట్టే.. ట్రంప్ ప్లేట్ ఫిరాయించేశారు!

నిల‌క‌డ‌లేని మాట‌లు… నిబ‌ద్ధ‌త లేని వ్య‌వ‌హారాల‌కు కేరాఫ్‌గా మారిన అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌.. 24 గంట‌ల్లో మాట మార్చేశారు. ప‌హెల్గామ్ ఉగ్ర‌దాడి విష‌యంపై తొలి రెండు రోజులు తీవ్రంగా స్పందించిన ట్రంప్‌.. ఈ విష‌యంలో భార‌త్ తీసుకునే ఏ నిర్ణ‌యానికైనా అమెరికా అండ‌గా ఉంటుంద‌ని తెలిపారు. అంతేకాదు.. ఉగ్ర‌వాద దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని.. ఇది ఎవ‌రు చేసినా త‌ప్పేన‌ని వ్యాఖ్యానించారు.

ఇక‌, అమెరికా ప్ర‌తిష్టాత్మ‌క మీడియా న్యూయార్క్ టైమ్స్‌.. ఉగ్ర‌దాడిని తీవ్ర వాద దాడిగా చూపించ‌డాన్ని కూడా.. అగ్ర‌రాజ్యం త‌ప్పుబ‌ట్టి త‌లంటింది. భార‌త్‌లోని ప‌హెల్గామ్‌లో జ‌రిగింది ముమ్మాటికీ ఉగ్ర‌దాడేన‌ని పేర్కింది. న్యూయార్క్ టైమ్స్ త‌న ప‌ద్ధ‌తిని మార్చుకోవాల‌ని సూచించింది. ఇన్ని ప‌రిణామాలు జ‌రిగిన త‌ర్వాత‌.. స‌హ‌జంగానే ట్రంప్.. భార‌త్‌కు అండగా ఉంటార‌ని.. అంద‌రూ అనుకున్నారు. కానీ, ట్రంప్ వ్య‌వ‌హార శైలి.. ఆయ‌న మిడిమిడి న‌డ‌త తెలిసిన వారు ముందు నుంచి అనుమానిస్తున్నారు.

ఖ‌చ్చితంగా ఇప్పుడు అదే జ‌రిగింది. “భార‌త్‌పై దాడిని ఖండించాల్సిందే. ఖండిస్తున్నాం కూడా. కానీ, ఈ విష‌యంలో భార‌త్‌-పాకిస్థాన్ దేశాలే తేల్చుకోవాలి. తృతీయ ప‌క్షం జోక్యం చేసుకుంటే బాగోదు” అని త‌న దైన శైలిలో ట్రంప్ వ్యాఖ్యానించారు. పోప్ ఫ్రాన్సిస్ అంత్య‌క్రియ‌లు శ‌నివారం వాటిక‌న్ సిటీలో జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో అమెరికా అధ్య‌క్షుడి హోదాలో ట్రంప్ ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన‌నున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న విమానంలోనే మీడియాతో మాట్లాడుతూ.. పైవిధంగా వ్యాఖ్యానించారు.

అంతేకాదు.. భార‌త్ మాదిరిగానే పాకిస్థాన్‌తోనూ త‌మ‌కు స్నేహ పూర్వ‌క సంబంధాలు ఉన్నాయ‌ని తెలిపా రు. జ‌మ్ము క‌శ్మీర్ స‌రిహ‌ద్దుల విష‌యంలో ఇరు దేశాల‌కు ఏళ్ల త‌ర‌బ‌డి వివాదాలు కొన‌సాగుతున్నాయ‌ని.. ఈ క్ర‌మంలో తాము జోక్యం చేసుకోవ‌డం భావ్యం కాద‌న్నారు. ఈ స‌మ‌స్య‌ను వారే ప‌రిష్క‌రించుకుంటార‌ని చెప్పారు. దీంతో ఒక్క‌సారిగా పాకిస్థాన్ వైపు నుంచి రియాక్ష‌న్ పెరిగింది. భార‌త్ కాలు దువ్వితే.. తాము గ‌ట్టిగా స‌మాధానం చెబుతామ‌ని.. పాక్ ప్ర‌ధాని వ్యాఖ్య‌లు రువ్వారు. ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు భుట్టే సైతం.. సింధు నీటిని ఆపేస్తే.. ర‌క్తం పారిస్తామ‌ని నోరు చేసుకున్నారు. సొ.. మొత్తానికి ట్రంప్ తెంప‌రి త‌నం మున్ముందు ఎలా ఉంటుందో చూడాలి.