టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శుక్రవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ కోసం ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు… ప్రధాని నివాసంలో మోదీతో శుక్రవారం సాయంత్రం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పెహల్ గాంలో జరిగిన ఉగ్రవాద దాడిపై ఇరువురు నేతల మధ్య కీలక చర్చ జరిగింది. 26 మందిని బలి తీసుకున్న ఈ దాడిని తీవ్రంగా ఖండించిన చంద్రబాబు… ఉగ్రవాదులపై కేంద్రం తీసుకునే ఏ నిర్ణయానికి అయినా సంపూర్ణంగా మద్దతు తెలపనున్నట్లు ప్రకటించారు. ఈ విషయంలో కేంద్రానికి ఏపీ అండగా నిలుస్తుందని కూడా మోదీకి చంద్రబాబు తెలిపారు.
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో పనుల పున:ప్రారంభానికి మోదీని ఆహ్వానించాలని ఇదివరకే చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ఇప్పటికే అమరావతిలో మోదీ టూర్ షెడ్యూల్ ఖరారు కాగా… ప్రొటోకాల్ ప్రకారం ప్రధానికి రాష్ట్రం తరఫున ఆహ్వానం అందించేందుకే చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. ఇదివరకే చంద్రబాబు ఢిల్లీ టూర్ ఖరారు కాగా… ఆలోగానే పెహల్ గాం ఉగ్రదాడి జరిగింది. ఈ నేపథ్యంలో మోదీతో భేటీలో పెహల్ గాం దాడి, తదనంతర పరిణామాలపైనే చంద్రబాబు ప్రదానంగా చర్చించారు. ఉగ్ర దాడిని తీవ్రంగా ఖండించిన చంద్రబాబు..ఉగ్రవాదుల పట్ల కఠినంగా వ్యవహరించాలని కూడా మోదీని కోరారు. ఈ పోరాటంలో కేంద్రానికి ఏపీ ప్రజలు సంపూర్ణ మద్దతుగా నిలుస్తారని చంద్రబాబు తెలిపారు.
గతంలో అమరావతిలో రాజధాని నిర్మాణ పనులను మోదీనే ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నిర్మాణ పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. తాజాగా 2024 ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు తీరిగి అధికారం చేపట్టడంతో రాజధాని నిర్మాణ పనులకు రంగం సిద్ధమైంది. రాజదానిలో అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయాల కోసం శాశ్వత భవన నిర్మాణాల టెండర్లను ఇప్పటికే ఖరారు చేసిన చంద్రబాబు సర్కారు.. వాటిని ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేసింది. దాదాపుగా రూ.1 లక్ష కోట్ల విలువైన పనులను ప్రారభించేందుకు రంగం సిద్ధం కాగా… వాటిని మే నెల 2న ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. మోదీ పర్యటనను ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న చంద్రబాబు సర్కారు.. భారీ ఏర్పాట్లను చేస్తున్న సంగతి తెలిసిందే.