రాష్ట్రంలో ప్రభుత్వానికి సలహాదారులు అవసరం. అప్పుడు వైసీపీకి అయినా.. ఇప్పుడు కూటమి ప్రబుత్వానికి అయినా సలహాదారులు కావాల్సిందే. అసలు కేంద్ర ప్రభుత్వం కూడా.. ఈ విషయంలో మినహాయింపు లేదు. అనేక రంగాల్లో నిష్ణాతులైన వారిని ఎంపిక చేసి మోడీ సర్కారు కేంద్రంలో సలహాదారులుగా నియమిస్తోంది. కానీ..ఏపీలో మాత్రం వైసీపీ హయాంలో రాజకీయ పునరావాస కేంద్రంగా సలహాదారుల నియామకాలు జరిగిపోయాయి.
సుమారు 182 మందిని సలహాదారులుగా నియమించారని.. అప్పట్లో వైసీపీపై టీడీపీనాయకులు దుమ్మెత్తి పోశారు. అంతేకాదు.. వీరిలో ముక్కుమొహం తెలియనివారిని కూడా నియమించారు. పోనీ.. ఇలా నియమితులైన వారికి ఆయా రంగాల్లో ఎంత పట్టుంది? ఎంత నిష్నాతులు అంటే చెప్పలేని పరిస్థితి నెలకొంది. అందుకే ఒకానొక కేసులో రాష్ట్ర హైకోర్టు.. అప్పటి వైసీపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించింది. చీఫ్ సెక్రటరీలకు బదులుగా సలహాదారులనే నియమిస్తారా? అంటూ.. నిప్పులు చెరిగింది.
అయినా.. జగన్ వినిపించుకోలేదు. ఇంత మంది ఎందుకు.. ? అని హైకోర్టు ప్రశ్నించినా.. ఆయన తీరులో మార్పు రాలేదు. పైగా.. వారికి 3.2 లక్షల రూపాయల చొప్పున వేతనం ఇచ్చారు. ఇతర భత్యాలు కూడా కల్పించారు. మొత్తానికి వైసీపీ అధికారం నుంచి దిగిపోవడంతో వారు కూడా తమ తమ పదవులకు రిజైన్ చేశారు. ఇక, ఇప్పుడు టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారుకూడా.. సలహాదారులను నియమిస్తోంది. ఇప్పటి వరకు 22 మంది సలహాదారులను నియమించినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి.
చిత్రం ఏంటంటే.. అప్పట్లో దాచినట్టే.. ఇప్పుడు కూడా సలహాదారుల వివరాలను ఎందుకు దాస్తున్నారో ఎవరికీ అర్ధం కాదు. కానీ.. ఇప్పటి వరకు నియమించిన వారిలో ఎవరికీ వంక పెట్టాల్సిన అవసరం లేదన్నది నిపుణులు చెబుతున్న మాట. తాజాగా గురువారం ప్రముఖ శాస్త్రవేత్త.. క్షిపణి ప్రయోగాల్లో దిట్టగా పేరున్న సతీష్రెడ్డి.. రాష్ట్రప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు. రాష్ట్రంలో శాస్త్ర , సాంకేతికత అభివృద్ధి, పెట్టుబడుల కల్పన వంటి విషయాలలో ఈయన సలహాలు ఇవ్వనున్నారు.
కొన్ని రోజుల కిందట ప్రముఖ కేన్సర్ వైద్యులు.. నోరి దత్తాత్రేయుడుని కూడా.. సలహాదారుగా నియమించారు. ఇక, ఆధ్యాత్మిక వేత్త చాగంటి కోటేశ్వరరావునుకూడా.. ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. ఇలా.. చంద్రబాబు చేపడుతున్న సలహాదారుల నియామకానికి వంక పెట్టలేనంతగా ఉండడం ఆయన విజన్కు దూరదృష్టికి నిదర్శనమని అంటున్నారు పరిశీలకులు..