ప్రజా నాయకుడు.. లేదా నాయకురాలు.. కావడానికి జెండా పట్టుకునే తిరగాల్సిన అవసరం లేదని.. ఈ దేశంలో అనేక మంది నిరూపించారు. ప్రజల సమస్యలు తెలుసుకుని, వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తూ.. ప్రజల మనసుల్లో చోటు దక్కించుకున్నవారు ఎందరో ఉన్నారు. అంత మాత్రాన వారు రాజకీయా ల్లో పాల్గొని పోటీ చేయాల్సిన అవసరం ఉండదు. ఇలాంటి వారిలో నర్మదాబచావో(నర్మదా నదిని రక్షించండి) పేరుతో ఉద్యమించిన మేధా పాట్కర్ వంటివారు ఉన్నారు.
ఇప్పుడు అలానే అప్రకటిత ప్రజానేతగా.. సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వర నిలుస్తున్నారు. ఆమె.. ప్రజలకు చేరువ కావడం.. వారి సమస్యలు పరిష్కరించడంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. నారా వారి సొంత నియోజకవర్గం కుప్పంలో ఎక్కువగా పర్యటిస్తున్నారు. నెలకు మూడు నుంచి నాలుగురోజుల పాటు అక్కడే ఉంటున్నారు. ఇక్కడ మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నారు. సాయం చేస్తున్నారు. అభివృద్ది పనులు కూడా చేపడుతున్నారు.
అంతేకాదు.. ఒక్కకుప్పమే అయితే.. భువనేశ్వరి గురించి.. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఎన్టీఆర్ జిల్లా నుంచి ఖమ్మం వరకు కూడా.. ఆమె తన ప్రజా ప్రస్థానాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. కృష్ణాజి ల్లాలోని తన తండ్రి గ్రామం నిమ్మకూరులో పెద్ద ఎత్తున పాఠశాలను నిర్మిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పేద విద్యార్థులను ఎంపిక చేసి.. వారికి స్కాలర్ షిప్పులు అందిస్తున్నారు. ఎన్టీఆర్ ట్రస్టును మరింత బలోపే తం చేసి.. పేదలకు, సమాజంలో అణగారిన వర్గాలకు ఆసరా చూపిస్తున్నారు.
ఇదంతా స్వచ్ఛంద సేవే కదా.. ప్రజానేత ఎలా అవుతారన్న ప్రశ్నలు సహజం. అయితే.. కేవలం స్వచ్ఛం ద సేవకు మాత్రమే భువనేశ్వరి పరిమితం కాలేదు. అవసరానికి తగిన విధంగా రాజకీయ అవతారం కూడా ఎత్తుతున్నారు. గత ఎన్నికల్లో ఊరూ వాడా ప్రచారం చేశారు. ఇప్పుడు కూడా.. పీ4 పథకంపై ఆమె అంతర్గతంగా పారిశ్రామిక వేత్తలతో చర్చిస్తున్నారు. వీరిలో మహిళా పారిశ్రామికవేత్తలను ఒప్పించే పనిలో ఉన్నారు. తద్వారా.. చంద్రబాబు ఆశయాలకు దన్నుగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. సో.. భువనేశ్వరి రాజకీయ నేత కాకపోవచ్చు.. కానీ, అప్రకటిత ప్రజానేతగా మాత్రం గుర్తింపు పొందుతున్నారనడంలో సందేహం లేదు.