వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చేస్తుందా ?

ఏమిటో కమలనాధుల మాటలు కోటలు దాటుతున్నట్లే అనిపిస్తోంది. విశాఖపట్నంలో రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చేస్తుందని చెప్పటంతో అందరు ఆశ్చర్యపోతున్నారు. వీర్రాజు, పార్టీ రాజ్యసభ ఎంపి జీవిఎల్ నరసింహారావు మాటలు విన్నతర్వాత కమలనాధులు తమను తాము ఎంత ఎక్కువగా ఊహించుకుంటున్నారో అర్ధమైపోయింది. బలమైన క్యాడర్ ఉన్న తెలుగుదేశంపార్టీ కూడా వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేస్తామని ధైర్యంగా చెప్పలేకపోతోంది. అలాంటిది అన్నీ నియోజకవర్గాల్లోను పోటీ చేయటానికి కనీసం గట్టి అభ్యర్ధులను కూడా దింపేస్ధితిలో లేని పార్టీ ఏకంగా అధికారంలోకి వచ్చేస్తామని చెప్పటమే విచిత్రంగా ఉంది.

వీర్రాజు రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి ఒకేసారి ఇటు వైసీపీ అటు టీడీపీ పై మైండ్ గేమ్ మొదలుపెట్టినట్లే ఉంది. అదేమంటే వచ్చే ఎన్నికల్లో తామే అధికారంలోకి రాబోయేదని పదే పదే చెబుతున్నారు. వీర్రాజు మరచిపోయిందేమంటే మైండ్ గేమ్ ఆడటంలో జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబునాయుడు ఇద్దరు ఇద్దరే. నిజానికి వీళ్ళముందు వీర్రాజు సరితూగలేరు. అసలు పార్టీకున్న బలం ఏమిటో మిగిలిన వాళ్ళకన్నా వీర్రాజుకే బాగా తెలిసుండాలి. అందరికీ తెలిసిన బీజీపే బలం ఏమిటంటే పోలింగ్ రోజున ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చే యంత్రాంగం కూడా లేదు. ఎందుకంటే అసలు పోటి చేయటానికి గట్టి అభ్యర్ధులే లేరు కాబట్టి.

మొన్నటి ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన ఓట్ల శాతం 0.84. అంటే నోటా (నన్ ఆఫ్ ది ఎబోవ్) కు వచ్చిన 3 శాతం ఓట్లకన్నా ఎంత తక్కువో అందరికీ అర్ధమైపోతోంది. వాస్తవంగా బీజేపికున్న బలం ఇదే. కాకపోతే ఎప్పుడైనా బలమైన గాలి వీచినపుడు, ఏదైనా బలమైన పార్టీతో పొత్త పెట్టుకున్నపుడు ఓ నాలుగు సీట్లలో గెలుస్తుందంతే. లేకపోతే కనీసం డిపాజిట్లు కూడా తెచ్చుకోలేందు. మొన్నటి ఎన్నికల్లో 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు సీట్లలో బీజేపీ పోటీ చేయలేకపోయింది. పోటి చేసిన నేతల్లో ఏ ఒక్కళ్ళకూ డిపాజిట్ కూడా రాలేదు.

విభజన చట్టంలో చెప్పినట్లుగా కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వలేదనే మంట జనాల్లో బాగా ఉంది. దానికితోడు ఇపుడు పోలవరం ప్రాజెక్టుకు నిధుల విడుదలను కేంద్రం కావాలనే వివాదం చేస్తోంది. ప్రత్యేకహోదా మంటకు తోడు ఇపుడు పోలవరం ప్రాజెక్టు కూడా తోడైంది. రాష్ట్రాభివృద్దికి పదే పదే అడ్డుకుంటున్న కేంద్రంలోని బీజేపీకి రాష్ట్రంలో జనాలు ఓట్లు ఎలా వేస్తారని వీర్రాజు అనుకుంటున్నారో అర్ధం కావటం లేదు. మామూలుగానే పార్టీకంటూ ఓటు బేస్ లేదు. దానికి తోడు బలమైన వైసీపీ లాంటి పార్టీ అధికారంలో ఉంది. బలమైన క్యాడర్ ఉన్న టీడీపీ ప్రతిపక్షంలో ఉంది. ఇలాంటపుడు బీజేపీని ఇంకెవరు పట్టించుకుంటారో చూడాల్సిందే.