పీఎస్ఆర్ ఆంజనేయులుకు 14 రోజుల రిమాండ్!

బాలీవుడ్ నటి కాదంబరి జత్వాని కిడ్నాప్ కేసులో ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ ఆర్ ఆంజనేయులు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విజయవాడ కోర్టులో ఆయనను హాజరుపరచగా 14 రోజులపాటు ఆయనకు కోర్టు రిమాండ్ విధించింది. ఆంజనేయులును విజయవాడలోని జిల్లా జైలుకు తరలించారు.ఈ కేసులో మంగళవారం నాడు ఆంజనేయులును అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 

ఈ క్రమంలోనే ఆంజనేయులు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెల్లడైనట్లు తెలుస్తోంది. వైసిపి ప్రభుత్వ పెద్దల అండదండలతో అధికార దుర్వియోగానికి ఆంజనేయులు పాల్పడినట్లుగా తెలుస్తోంది. పక్క ప్రణాళికతోనే జత్వాని, ఆమె తల్లిదండ్రులను అరెస్టు చేశారని తెలుస్తోంది. దాని వెనుక ఆంజనేయులు ఆదేశాలు ఉన్నాయని సిఐడి అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆంజనేయులుతో పాటు అప్పటి విజయవాడ సిపి కాంతి రానా టాటా, డీసీపీ విశాల్ గున్నీల మధ్య ఫోన్ కాల్ సంభాషణలు సిఐడి అధికారులు సేకరించినట్లుగా తెలుస్తోంది.

జత్వాని నివాసం ఉండే ప్రాంతంలో ముంబై పోలీసులతో ఆంజనేయులు మాట్లాడిన కాల్ డేటాను కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా రిమాండ్ రిపోర్టులో పోలీసులు వెల్లడించారని తెలుస్తోంది. అంతేకాకుండా జత్వానిపై వైసిపి నేత కుక్కల విద్యాసాగర్ ఇచ్చిన ఫిర్యాదు కూడా నకిలీఛని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. ఆ భూ లావాదేవీలకు జత్వానికి ఎటువంటి సంబంధం లేదని తెలుస్తోంది. ఇక ఈ కేసు ప్రత్యక్షంగా సంబంధం లేకపోయినప్పటికీ విశాఖపట్నం డిసిపిగా బదిలీ అయిన విశాల్ ను సీఎంవోకు పిలిపించి ఆంజనేయులు ఒత్తిడి చేశారని తెలుస్తోంది. 

జత్వాని, ఆమె తల్లిదండ్రులను అరెస్టు చేసి తెచ్చిన తర్వాతే విశాఖకు రిలీవ్ చేస్తామని, లేదంటే విజయవాడలో ఉండాల్సి వస్తుందని ఆంజనేయులు స్పష్టం చేసినట్లుగా విశాల్ తన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఆమె కుటుంబ సభ్యులను ముంబై నుంచి విజయవాడకు రోడ్డు మార్గంలో బలవంతంగా తీసుకురావడం, బలవంతంగా నిర్బంధించడం, ముంబైలో ఆమె పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని బెదిరించడం వంటి చర్యలు ఆమె వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించాయని తమ రిమాండ్ నివేదికలో పోలీసులు పేర్కొన్నారని తెలుస్తోంది.

అయితే , ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఆ విషయం ఏమిటో చూడాలని మాత్రమే తాను చెప్పానని , అంతకుమించి ఈ కేసులో తన ప్రమేయం లేదని ఆంజనేయులు కోర్టులో స్వయంగా వాదించారట.