బొత్స ఎఫెక్ట్‌: మిగ‌తావారికి వాయిస్ క‌ట్‌!

మంత్రి బొత్స ఎంత సీనియ‌ర్ నాయ‌కుడో.. అంతే వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ప్ర‌తి కార్య‌క్ర‌మాన్నీ.. ఆయ‌న త‌న క‌నుస‌న్న‌ల్లోనే జ‌రిపిస్తున్నారు. ఈ విష‌యంలో ఎక్క‌డా రాజీ ప‌డ‌డం లేదు. దీంతో మిగిలిన నేత‌ల‌కు వాయిస్ లేకుండా పోతోంద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. త‌న బంధుగ‌ణం ఎక్కువ‌గా ఉన్న జిల్లాలో.. వారిని ప్రోత్స‌హించేందుకు అవ‌స‌ర‌మైతే.. మిగిలిన వారిని.. వారు సొంత పార్టీ నేత‌లే అయినా.. తొక్కేస్తున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది.

ముఖ్యంగా విజ‌య‌న‌గ‌రం ఎమ్మెల్యే కోల‌గట్ల వీర‌భ‌ద్ర‌స్వామి, స్థానిక ఎమ్మెల్యే పెన్మ‌త్స సూర్య‌నారాయ‌ణ రాజు, కురుపాం ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పుష్ప‌శ్రీవాణి.. వంటివారిపై బొత్స దూకుడు మ‌రింత పెంచారని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఆయ‌న హ‌వానే కొన‌సాగ‌డంతోపాటు.. ఆయ‌న అనుచ‌రులు, మేన‌ల్లుడు, ఎమ్మెల్యే బొండుకొండ హ‌వాకు ఎక్క‌డా బ్రేకులు ప‌డ‌కుండా చూసుకుంటున్నార‌ని పెద్ద ఎత్తున చ‌ర్చ నడుస్తోంది. ఇటీవ‌ల జిల్లాలోనే కీల‌క‌మైన సిరిమాను ఉత్సవం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి వాస్త‌వంగా.. స్థానిక ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల‌కు ప్రాధాన్యం ఉంటుంది.

కానీ, మంత్రి బొత్స , ఆయ‌న స‌తీమ‌ణి ముఖ్య భూమిక పోషించారు. దీంతో కార్య‌క్ర‌మం అంతా కూడా వీరి చేతుల మీదుగానే జ‌రిగిపోయింది. ఇక‌, విజ‌య‌న‌గ‌రం, నెల్లిమ‌ర్ల‌, చీపురుప‌ల్లి.. నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ బొత్స అనుచ‌రుల‌దే పైచేయిగా ఉంది. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో బొత్స వ‌ర్గం హ‌వాపై కోల‌గ‌ట్ల ఎప్ప‌టిక‌ప్పుడు అలెర్ట్ అవుతున్నా.. అధికారులు స‌హ‌క‌రించ‌డం లేద‌నే ఆరోప‌ణ‌లు కూడా వ‌స్తున్నాయి. ఇక‌, నెల్లిమ‌ర్ల‌లోనూ త‌న మేన‌ల్లుడు కోసం.. పార్టీలోని మిగిలిన నేత‌ల‌ను ఎద‌గ‌నీయ‌కుండా బొత్స అడ్డుకుంటున్నార‌ని అంటున్నారు.

అదేస‌మ‌యంలో అంతో ఇంతో వాయిస్ ఉన్న వారిని కూడా త‌న క‌నుసైగ‌ల‌తో బొత్స శాసిస్తున్నారు అయితే, ఇది పార్టీకి మంచి చేసేదే అయితే.. ఎవ‌రైనా ఆహ్వానించాల్సిందే. అయితే, ఇది వ్య‌క్త‌గ‌త రాజ‌కీయాల‌కు, కుటుంబ రాజ‌కీయాల‌కు మాత్రమే ప‌రిమితం కావ‌డం.. మిగిలిన వారిని డ‌మ్మీలు చేసే ప్ర‌య‌త్నాలు చేయ‌డం వంటివి మాత్రం బొత్స చుట్టూ విమ‌ర్శ‌ల‌కు తావిస్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఓర్పుతో ఉన్న నాయ‌కులు.. కేడ‌ర్‌.. ఎదురుతిరిగితే.. దాదాపు ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో అధికార పార్టీ విభేదాలు తార‌స్థాయికి వ‌స్తాయ‌ని అంటున్నారు.