అమ‌రావ‌తిలో అన్న‌గారి విగ్ర‌హం.. ఇదిగో ఇలా..!

న‌వ్యాంధ్ర రాజ‌ధానిలో పెట్టుబ‌డులు.. ప‌రిశ్ర‌మ‌లు.. మాత్ర‌మేకాదు.. క‌ల‌కాలం గుర్తుండిపోయేలా.. ప్ర‌ముఖ ప‌ర్యాట‌క ప్రాంతంగా కూడా దీనిని తీర్చిదిద్దేందుకు సీఎం చంద్ర‌బాబు కృషి చేస్తున్నారు. ఈ నేప‌థ్యం లో తెలుగు వారి ఆరాధ్య క‌థానాయ‌కుడు.. పేద‌ల ముఖ్య‌మంత్రిగా పేరు తెచ్చుకున్న అన్న‌గారు.. ఎన్టీ ఆర్ విగ్ర‌హాన్ని దేశంలోనే అత్యంత ఎత్త‌యిన రీతిలో.. రికార్డు స్థాయిలో నెల‌కొల్పేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించి కొన్ని ఫొటోల‌ను ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది. 

విజ‌య‌వాడ‌-గుంటూరు-మంగ‌ళ‌గిరి-తాడేప‌ల్లి ప్రాంతాల‌ను క‌లుపుతూ.. మెగా సిటీగా రూపొందించాల‌ని సీఎం చంద్ర‌బాబు నిర్ణ‌యించారు. ఈ క్ర‌మంలో కృష్ణాన‌దిని క‌లుపుతూ.. అమ‌రావ‌తిలో ఏర్ప‌డే.. ప్రాంతంలో అన్న‌గారి విగ్ర‌హాన్నినిర్మించాల‌ని సంక‌ల్పించారు. దీనిని దేశంలోనే అత్యంత ఎత్త‌యిన విగ్ర‌హంగా రూపొందించాల‌ని భావించారు. తాజాగా ఈ విష‌యంపైనే.. రాజ‌ధాని వ్య‌వ‌హారాల‌ను ప్ర‌త్యేకంగా ప‌ర్య‌వేక్షిస్తున్న‌ మంత్రి నారాయ‌ణ త‌న బృందంతో గుజ‌రాత్‌లో ప‌ర్య‌టించి వ‌చ్చారు. 

గుజ‌రాత్‌లో ఉక్కు మ‌నిషి.. స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ విగ్ర‌హాన్ని కేంద్ర ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించింది. దీనిలోనే గ్రంథాల‌యం, వైద్య శాల స‌హా.. విగ్ర‌హం కింది భాగంలో అత్యంత అపురూప‌మైన వ‌న్య‌ప్రాణుల‌తో కూడిన జూను కూడా ఏర్పాటు చేశారు. ఇది గుజ‌రాత్‌కే మ‌కుటాయ‌మాన‌మైన ప‌ర్యాట‌క కేంద్రంగా మారింది. ఈ నేప‌థ్యంలో అలాంటిదే ఏపీలోనూ..ముఖ్యంగా రాజ‌ధానిలోనూ నిర్మించ‌నున్నారు. దీనికి సంబంధించి అన్న‌గారి విగ్ర‌హం ఇలా నిర్మించ‌బోతున్నామ‌ని ప్ర‌భుత్వం ప‌లు ఫొటోల‌ను విడుద‌ల చేసింది. 

అదేవిధంగా అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ADCL) అమరావతిలోని నీరుకొండలో నందమూరి తారక రామారావు విగ్రహం మరియు స్మారక చిహ్నం కోసం వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదిక (DPR) సిద్ధం చేయడానికి కన్సల్టెంట్‌ను నియమించడానికి టెండర్లు వేసింది. దీంతో అమ‌రావ‌తిలో అన్న‌గారి విగ్ర‌హంఏర్పాటుకు మార్గం సుగ‌మం అవుతోంది.