అప్పుడు నువ్వు చెసిందేటి జగన్?

అధికారంలో ఉన్న‌ప్పుడు ఒక విధంగా.. అధికారం లేన‌ప్పుడు మ‌రో విధంగా వ్య‌వ‌హ‌రించ‌డం.. వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు కామ‌న్ అయిపోయిందా? ఆయ‌న వ్య‌వ‌హార శైలి.. తాను చేసిన త‌ప్పులు మ‌రిచి..త‌న హ‌యాంలో జ‌రిగిన దుర్రాజ‌కీయం మ‌రిచి.. నేడు నీతులు చెబుతున్నారు. తాజాగా గ్రేట‌ర్ విశాఖ‌ప‌ట్నం మునిసిప‌ల్ కార్పొరేష‌న్‌లో కూట‌మి జెండా ఎగ‌రడాన్ని ఆయ‌న త‌ప్పు బ‌ట్టారు. సీఎం చంద్ర‌బాబుకు ఓ సుదీర్ఘ లేఖ‌ను సంధించారు. అదికూడా త‌న సోష‌ల్ మీడియాలోనే కావ‌డం గ‌మ‌నార్హం. మీడియా ముందుకురాలేక పోతున్నారో.. వ‌స్తే.. ఆయ‌న హ‌యాంలో జ‌రిగిన ఘోరాల‌ను ప్ర‌శ్నిస్తార‌న్న సందేహమో తెలియ‌దు కానీ.. జ‌గ‌న్ ఇప్ప‌టికీ సోష‌ల్ మీడియాలోనే స్పందిస్తున్నారు.

తాజా లేఖ ఇదీ..

“రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తున్నారు. ప్రజలిచ్చిన తీర్పును అపహాస్యం చేస్తూ, గూండాయిజం చేస్తూ, ప్రలోభాలు, బెదిరింపులకు దిగి విశాఖపట్నం మేయర్‌గా ఉన్న బీసీ మహిళను పదవినుంచి దించేయడం, మీరు చేస్తున్న దుర్మార్గపు రాజకీయాలకు ప్రత్యక్ష సాక్ష్యం.” అని జ‌గ‌న్ పేర్కొన్నారు. గ‌తంలో వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన‌ప్పుడు కూడా ఇలానే చేశారని టీడీపీ నాయ‌కులు చెబుతున్నారు. వారికి కూడా స‌మాధానం ఇస్తే బాగుండేది.

ఇక‌, “ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం 98 డివిజన్లు ఉన్న విశాఖపట్నం కార్పొరేషన్‌లో వైయస్సార్‌సీపీ గుర్తుపై పోటీచేసి 58 స్థానాలను మా పార్టీవాళ్లు గెలుచుకోగా, టీడీపీ కేవలం 30 సీట్లు మాత్రమే గెలిచింది. మరి మీకు మేయర్‌ పదవి ఏరకంగా వస్తుంది? బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ యాదవకులానికి చెందిన మహిళను మేం మేయర్‌ పదవిలో కూర్చోబెడితే, మీరు అధికార దుర్వినియోగంచేస్తూ, కోట్లాది రూపాయలతో ప్రలోభపెట్టి, పోలీసులను దుర్వినియోగం చేస్తూ, బెదిరిస్తూ, అప్పటికీ లొంగకపోతే మా పార్టీ కార్పొరేటర్లు విడిది చేసిన హోటల్‌పై మీ నాయకులతోనూ, పోలీసులతోనూ దాడులు చేయించారు. దీనికి సంబంధించిన సీసీ కెమెరా వీడియోలు ఇప్పుడు ప్రజల ముందే ఉన్నాయి. మరి దీన్ని ప్రజాస్వామ్యం అంటారా?” అని వ్యాఖ్యానించారు.

చీరాల విష‌యంలో వైసీపీ కూడా ఇలానే చేసింద‌న్న వాద‌న ఉంది. దానినిఅప్ప‌ట్లో స‌మ‌ర్థించుకున్న వైసీపీ అధినేత జ‌గ‌న్ ఇప్పుడు మాత్రం ప్ర‌జాస్వామ్యం పేరుతో ప్ర‌శ్నించ‌డం ఆయ‌న‌కే చెల్లింద‌ని టీడీపీ నాయ‌కులు వ్యాఖ్యానిస్తున్నారు.