వైసీపీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసులో అత్యంత కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న దాల్మియా సిమెంట్స్ కంపెనీకి చెందిన రూ.793 కోట్ల ఆస్తులను ఎన్ ఫోర్స్మెంటు డైరెక్టరేట్ తాజాగా అటాచ్ చేసింది. తద్వారా రూ.793 కోట్ల ఆస్తులకు సంబంధించి ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించినా.. ఈడీకి చెప్పి చేయాలి. అదేవిధంగా ప్రతి రూపాయికి ఇక నుంచి లెక్కలు సమర్పించాలి. ఒకరకంగా.. ఇది పెద్ద దెబ్బేనని చెప్పాలి.
ఏంటి విషయం?
దాల్మియా సిమెంట్స్ కంపెనీ ఏర్పాటు చేసేందుకు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో వేల కోట్ల రూపాయలతో సదరు కంపెనీ పెట్టుబడులు పెట్టింది. ఈ క్రమంలో 417 హెక్టార్లలో ఉన్న సున్నపురాయి ఖనిజాలను ఆ సంస్థ పొందింది. ఈ గనులన్నీ కడపలోనే ఉన్నాయి. ఇంత వరకు బాగానే ఉంది. అయితే.. ఈ కంపెనీ ద్వారా జగన్కు చెందిన కంపెనీలకు సొమ్ములు ముట్టాయన్నది ప్రధాన అభియోగం.
అంటే.. నీకిది-నాకది తరహాలో దాల్మియా కంపెనీకి అనుమతులు ఇవ్వడం ద్వారా.. జగన్కు చెందిన కంపెనీల్లో ఆ సంస్థతో పెట్టుబడులు పెట్టించారు. ఇలా.. రఘురామ్ సిమెంట్స్లో 95 కోట్ల రూపాయల విలువైన షేర్లను దాల్మియా కొనుగోలు చేసింది.(అంటే.. ఒక సిమెంటు కంపెనీ మరో సిమెంటు కంపెనీలో పెట్టుబడులు పెట్టడం). ఇది ఎక్కడైనా సాధ్యమేనా? అన్నది ప్రశ్న. కానీ.. వైఎస్ హయాంలో జరిగింది.
అదేవిధంగా 55 కోట్ల రూపాయలను మనీ లాండరింగ్ రూపంలో కూడా ఈ సంస్థకు నిధులు సమకూర్చించింది. అంటే.. ఈ మొత్తం 150 కోట్ల రూపాయలను దాల్మియా.. కంపెనీ జగన్ కంపెనీలకు సమర్పించుకుందని.. ఈడీ లెక్కలు తేల్చింది. ఈ క్రమంలోనే దాల్మియా కంపెనీకి చెందిన రూ.793 కోట్ల విలువైన ఆస్తులను తాజాగా అటాచ్ చేసింది.