యావత్తు దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వక్ఫ్ సవరణ చట్టంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ఈ వ్యవహారంపై బుధవారం మధ్యాహ్నం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారుకు ఓ కీలక ప్రశ్నను సంధించింది. వక్ఫ్ బోర్డుల్లో ఇద్దరు ముస్లిమేతరులకు చోటు కల్పించేలా సవరణ చట్టంలో ఓ అంశాన్ని పొందుపరచిన వైనాన్ని ప్రస్తావించిన కోర్టు… హిందూ ట్రస్టుల్లో ముస్లింలకు చోటు కల్పిస్తారా? అని సూటిగా ప్రశ్నించింది. వెరసి వక్ఫ్ సవరణ చట్టంపై విచారణపై సర్వత్రా ఆసక్తి రేకెత్తేలా చేసింది.
వక్ఫ్ చట్టానికి పలు సవరణలు ప్రతిపాదించిన ఎన్డీఏ సర్కారు… సదరు సవరణలతో పార్లమెంటులో ఓ బిల్లును ప్రవేశపెట్టి … దానిపై సుదీర్ఘ చర్చ జరిగేలా చేసింది. ఇందుకోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని కూడా నియమించింది. ఇటీవలే పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లును పార్లమెంటు ఉభయసభల్లో ప్రవేశపెట్టిన ఎన్డీఏ… ఇరు సభల్లోనూ ఆమోదం లభించేలా చేసుకుంది. ఆ తర్వాత బిల్లును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించడంతో వక్ఫ్ సవరణ బిల్లు చట్టంగా మారిపోయింది. అయితే ఈ సవరణ చట్టంలోని పలు అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు చట్టంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ పిటిషన్లన్నింటిపై ఒకే విచారణ చేపడతామన్న కోర్టు .. తాను చెప్పినట్లుగానే అన్ని పిటిషన్లను కలిపి బుధవారం విచారణ చేపట్టింది.
వక్ఫ్ సవరణ చట్టంలో కొత్తగా చేరిన వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతర సభ్యుల అంశంపై సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది. బిల్లుపై జేపీసీ చర్చల సందర్భంగా నాలుగు మార్పులను ప్రతిపాదించిన టీడీపీ… వాటిలో మూడింటిని మార్పించేసింది. అయితే వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరుల నియామకం మరియు రాష్ట్రానికి నియమించే హోదా కల్పించాలని టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసినా కూడా దానిని మార్చేందుకు ఎన్డీఏ సిద్ధపడలేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు విచారణలో ఇదే అంశం ప్రధానంగా ప్రస్తావనకు రావడం గమనార్హం. సుప్రీం కోర్టు ప్రశ్నించినట్లుగా వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతర సభ్యుల నియామకం దేనికి? అన్న భావన వ్యక్తమవుతోంది. హిందూ ట్రస్టుల్లో ముస్లింలకు చోటు కల్పించరు కదా… మరి ముస్లింలకు చెందిన వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులకు పాత్ర ఎందుకు అన్నది సర్వసాధారణంగా వినిపించే ప్రశ్నే కథా.
వాస్తవానికి వక్ఫ్ సవరణ బిల్లులో ఎన్డీఏ ప్రతిపాదించిన వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులకు చోటు అవసరం లేదని మెజారిటీ రాజకీయ పార్టీలు వాదించాయి. ఈ అంశం దాదాపుగా అన్ని పార్టీలను కూడా డోలాయమానంలో పడేసిందని కూడా చెప్పాలి. టీడీపీ కూడా ఇదే అంశాన్ని లేవనెత్తింది. ఎన్డీఏలో కీలక బాగస్వామిగా ఉన్న టీడీపీ… బిల్లును వ్యతిరేకంచలేదు కాబట్టి… బిల్లులో ముస్లింలకు నష్టం చేసే అంశాలను మార్పించే దిశగా చర్యలు చేపట్టింది. అందులో మూడు అంశాల్లో విజయం సాధించిన టీడీపీ… ఒకే ఒక్క అంశాన్ని మాత్రం మార్పించలేకపోయింది. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఇదే అంశాన్ని ప్రాతిపదికగా చేసుకుని కేంద్రానికి ప్రశ్నలు సంధించింది. మరి కోర్టు సంధించిన ఈ ప్రశ్నకు కేంద్రం నుంచి ఎలాంటి సమాధానం వస్తుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.