వైసీపీ అధినేత జగన్ తమపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై పోలీసు అధికారుల సంఘం.. హైకోర్టును ఆశ్రయించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వ జోక్యాన్ని కోరుతూ.. అధికారుల సంఘం తాజాగా లేఖ రాసింది. అయితే..తాజాగా రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మీడియాతో మాట్లాడుతూ.. జగన్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని.. అయితే.. ప్రభుత్వ పరంగా కంటే కూడా.. న్యాయ పోరాటం ద్వారానే పోలీసులకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్టు వ్యాఖ్యానించారు.
ఇక, మంత్రి అనిత వ్యాఖ్యల నేపథ్యంలో పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు కూడా మీడియా ముందుకు వచ్చారు. జగన్ చేసిన వ్యాఖ్యలను తాము ముక్తకంఠంతో ఖండిస్తున్నట్టు చెప్పారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న తమపై రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. గతంలో విజయవాడలోనూ జగన్.. ఇలానే వ్యాఖ్యానించారని చెప్పారు. ఇది సభ్యసమాజం ఆలోచించాల్సిన ఘటనగా ఆయన పేర్కొన్నారు.
విజయవాడలో మాట్లాడినప్పుడు.. సప్తసముద్రాల ఆవల ఉన్నా.. పోలీసులను ఈడ్చుకొచ్చి శిక్షిస్తామని అన్నారని.. ఇప్పుడు.. యూనిఫాం ఊడబీకుతామని హెచ్చరించారని.. శ్రీనివాసరావు అన్నారు. ఇది.. నైతికంగా పోలీసుల మనోస్థయిర్యాన్ని దెబ్బతీయడమేనని చెప్పారు. రాజకీయాలు చేసేందుకు పోలీసులసు ఎవరూ సిద్ధంగా లేరని.. దీనిపై న్యాయ పరంగానే పరిష్కరించుకునేందుకు తమ సంఘంలో చర్చించుకుని నిర్ణయం తీసుకుంటామన్నారు.
భవిష్యత్తులో పోలీసులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత విధులపై వారికి విశ్వసాన్ని కల్పించాల్సిన అవసరం సంఘంగా తమకు బాధ్యత ఉందన్నారు. సో.. దీనిని బట్టి.. పోలీసుల అధికారుల సంఘం తరఫున జగన్పై హైకోర్టును ఆశ్రయించే అవకాశం కనిపిస్తోంది. గతంలో మహారాష్ట్రలోనూ అక్కడి పోలీసు అధికారుల సంఘం శివసేనపై కోర్టును ఆశ్రయించి విజయం దక్కించుకున్నారు. అప్పట్లో పోలీసులను ‘కూలీలు’ అంటూ.. శివసేన నేత రౌత్ వ్యాఖ్యానించారు.