సోము క‌న్నా.. క‌న్నానే బెట‌ర్‌..

ఏ పార్టీలో అయినా.. నాయ‌కుడు మారితే.. విధానం మారుతుంది. అదే స‌మ‌యంలో కార్య‌క‌ర్త‌లు, ఇత‌ర నేత‌ల్లోనూ మార్పులు వ‌స్తాయి. నాయ‌కుడిని బ‌ట్టి.. పార్టీ స్వ‌రూపం కూడా మారిపోతుంది. మ‌రీ ముఖ్యంగా జాతీయ పార్టీలు ఇలాంటి మార్పుల కోస‌మే.. రాష్ట్రాల్లో అధ్య‌క్షుల‌ను మారుస్తూ ఉంటాయి. మ‌రింత ఉన్న‌తంగా పార్టీని ముందుకు తీసుకువెళ్తార‌ని, పార్టీని మ‌రింత‌గా బ‌లోపేతం చేస్తార‌ని నాయ‌కుల‌పై ఆశ‌లు పెట్టుకుంటాయి. కానీ, ఏపీ విష‌యంలో బీజేపీ ఆశించింది ఒక‌టైతే.. జ‌రుగుతున్న‌ది మ‌రొక‌ట‌నే వ్యాఖ్య‌లు అప్పుడే వినిపించ‌డం ఆస‌క్తిగా మారింది. దీనిపై ఇప్ప‌టికే కేంద్రంలోని బీజేపీ పెద్ద‌లు సైతం దృష్టి పెట్టార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

ప్ర‌స్తుతం ఏపీలో బీజేపీ నేత‌ల‌ను ప‌ల‌క‌రిస్తే.. గ‌తంలో బీజేపీని న‌డిపించిన క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ వాస‌న‌లు ఇంకా వ‌దల‌లేద‌ని అంటున్నారు. అంటే.. వారి ఉద్దేశం.. చెడు అని కాదు.. సోము వీర్రాజు వంటి ఆర్ ఎస్ ఎస్ మూలాలు ఉన్న నాయ‌కుడు ఏపీ బీజేపీ ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత ఏదో భారీ మార్పును ఆశించిన కీల‌క నేత‌ల‌కు ఆ మార్పు క‌నిపించ‌క‌పోవ‌డ‌మే ఇప్పుడు పెద్ద చిక్కుగా మారింది. సోము వీర్రాజు క‌న్నా.. క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణే బాగా ప‌నిచేశార‌నే వాద‌న వినిపిస్తుండ‌డానికి వారు కొన్ని ఉదాహ‌ర‌ణ‌ల‌ను కూడా చూపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఇటీవ‌ల ఓ సీనియ‌ర్ నాయ‌కుడు ఢిల్లీలో ఆఫ్ ది రికార్డుగా మీడియా మిత్రుల‌తో మాట్లాడారు.

పార్టీలో మార్పు జ‌రిగిందంటే.. ఏదో ఆశిస్తున్నార‌నే విష‌యం వాస్త‌వం. ఏపీ విష‌యంలో అలాంటి మార్పు ఇంకా రాలేదుఅని ఆయ‌న చెప్పుకొచ్చారు. గ‌తంలో క‌న్నా ఉన్న‌ప్పుడు అంద‌రూ స్వేచ్ఛ‌గా మీడియా ముందుకు వ‌చ్చేవారు. బీజేపీ లైన్ ప్ర‌కారం మాట్లాడేవారు. స‌ర్కారుపై విమ‌ర్శ‌లు చేసేవారు. ఇక‌, క‌న్నా అయితే. నిత్యం ఎక్క‌డో ఒక చోట క్షేత్ర‌స్థాయి ప‌ర్య‌ట‌న పెట్టుకునేవారు. స‌ర్కారు త‌ప్పుల‌ను ఎత్తి చూపించేవారు. విమ‌ర్శ‌లు గుప్పించేవారు. మ‌రీ ముఖ్యంగా ఇసుక విధానం, పోల‌వ‌రం నిర్మాణం ఆగిపోవ‌డం, రాజ‌ధాని అమ‌రావ‌తి త‌ర‌లింపు, రైత‌లుకు న్యాయం చేయాల‌నే డిమాండ్ల‌ను ఆయ‌న బాగానే వినిపించారు.

కానీ, సోము వీర్రాజు ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత‌.. ఈత‌ర‌హా విధానాల‌కు స్వ‌స్తి చెప్పిన‌ట్టు బీజేపీలోనే వ్యాఖ్యలు వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. పైగా ఆయ‌న వ‌చ్చిన వెంట‌నే మీడియాతో మాట్లాడే సొంత పార్టీ నేత‌ల‌పై వేట్లు వేయ‌డం ప్రారంభించారు. పోనీ.. వివాదాస్ప‌ద నేత‌ల‌కు ముకుతాళ్లు వేస్తున్నారా? అంటే.. అది కూడా క‌నిపించ‌డం లేదు. ఇటీవ‌ల పార్టీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి హోదా లో ఉన్న విష్ణు వ‌ర్ధ‌న్‌రెడ్డి మ‌హిళల చీర‌ల‌పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. పార్టీ అధ్య‌క్షుడుగా ఉన్న సోము.. ఈ విష‌యాన్ని లైట్ తీసుకున్నారు. దీంతో ఇది కేంద్రంలోని పెద్దల వ‌ర‌కు వెళ్లింది.
అదేస‌మ‌యంలో ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేయాల్సిన ఆయ‌న ప్ర‌తిప‌క్షాన్ని ఏకేస్తున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. ఇలాంటి చ‌ర్య‌ల‌తో బీజేపీ పుంజుకుంటుందా? అనే సీనియ‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం క‌నిపించ‌డం లేదు. ఈ నేప‌థ్యంలోనే క‌న్నానే బెట‌ర్ అనే వ్యాఖ్య‌లు బ‌ల‌ప‌డుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి సోము మార‌తారా? లేదా? చూడాలి.