కేంద్ర ప్రభుత్వం వద్ద వివిధ రాష్ట్రాలకు సంబంధించిన చాలా అంశాలు పెండింగ్ లో అలా ఏళ్ల తరబడి ఉంటూనే ఉంటాయి. ఖజానా ఖాళీ అయినప్పుడో,లేదంటే తెలివి కలిగిన నేత సీఎంగా వస్తే…ఆయా రాష్ట్రాలు కేంద్రాన్ని సంప్రదిస్తూ ఉంటాయి. తాము పంపిన ఆయా అంశాలన్నీ పెండింగ్ లో ఉన్నాయని… కాస్తంత పెద్ద మనసు చేసుకుని వాటిని పరిష్కరించాలని కోరుతూ ఉంటాయి. ఈ క్రమంలో ఒకటికి పది సార్లు ఆయా రాష్ట్రాలు అడిగితే కేంద్రం కూడా లేదు పొమ్మని చెప్పలేదు కదా. ఇదే ఫార్ములాతో ఏపీలోని కూటమి సర్కారు కదులుతోంది. స్లోగానే అయినా తెలివిగా పావులు కదుపుతున్న కూటమి సర్కారు కేంద్రం నుంచి రావాల్సిన వాటిని ఇట్టే రాబట్టేస్తోంది. వెరసి ఆశించిన దాని కంటే కూడా అదిక మొత్తం లోనే కేంద్రం నుంచి నిధులను సాధించుకుంటోంది.
ఈ వ్యూహంలో భాగంగా ఆయా కేంద్ర పథకాలకు సంబంధించి పెండింగ్ అంశాలను ఏపీ బయటకు తీస్తోంది. వాటిలో ఒక్కో దానిని ఒక్కోసారి అన్నట్లుగా కేంద్రం వద్ద ప్రతిపాదిస్తోంది. ఎన్డీఏలో ఎలాగూ కూటమిలోని కీలక భాగస్వామిగా టీడీపీ, మరో బలమైన మిత్రపక్షంగా జనసేన కొనసాగుతున్న నేపథ్యంలో కూటమి కేబినెట్ మంత్రులు అడిగినంతనే కేంద్రం నుంచి ఆయా అంశాలకు సంబంధించిన పెండింగ్ పనులు ఇట్టే పూర్తి అయిపోతున్నాయి. ఆయా పథకాలకు సంబందించిన నిధుల్లోనూ మెజారిటీ వాటాను కూడా ఏపీ సాధిస్తోంది. దీనికి జల జీవన్ మిషన్ కింద ఏపీకి వచ్చిన నిధులే నిదర్శనం.
తాజాగా మంగళవారం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉన్న జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పురీతో సమావేశమయ్యారు. ఈ భేటీలో వంట గ్యాస్ సబ్సీడీ పథకం ఉజ్వల్ యోజన కింద రాష్ట్రం నుంచి వెళ్లిన ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదించని విషయాన్ని నాదెండ్ల ప్రస్తావించారు. చాలా కాలంగా ఈ అంశం కేంద్రం వద్ద పెండింగ్ లో ఉందని కూడా ఆయన గుర్తు చేశారు. అంతేకాకుండా పెండింగ్ లో ఏపీకి సంబంధించిన 65.40 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని ఆయన కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ కనెక్షన్లకు ఉజ్వల్ యోజన పథకాన్ని వర్తింపజేయాలని నాదెండ్ల కేంద్ర మంత్రిని కోరారు.
నాదెండ్ల వినతికి హర్ దీప్ సింగ్ పురి నుంచి సానుకూల స్పందనే లభించినట్టు ఈ భేటీ తర్వాత నాదెండ్ల తెలిపారు. ఈ కనెక్షన్లకు ఉజ్వల్ పథకం వర్తింపుతో ఏపీకి లాభమేమిటన్న విషయానికి వస్తే… ఈ కనెక్షన్లన్నింటికీ ఉజ్వల్ యోజన వర్తిస్తే… ఏపీకి ఏటా రూ.580 కోట్ల మేర సబ్సీడీ నిధులు వస్తాయట. ప్రస్తుతం ఏపీలోని కూటమి సర్కారు ప్రతి ఇంటికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగానే పంపిణీ చేస్తోంది. సూపర్ సిక్స్ హామీల్లో ఈ పథకాన్నే కూటమి సర్కారు అమలులోకి తీసుకువచ్చింది. ఇప్పుడు ఉజ్వల్ పథకం పెండింగ్ అంశాన్ని కేంద్రం పరిష్కరిస్తే… ఏడాదికి రూ.580 కోట్ల నిధులు రాష్ట్రానికి వస్తే,.. ఉచిత గ్యాస్ పథకానికి ఇక ఢోకానే ఉండదన్న వాదన వినిపిస్తోంది.