వలంటీర్లను వంచించిందెవరు?.. పవన క్లారిటీ ఇచ్చేశారు!

ఏపీలో వలంటీర్ వ్యవస్థపై ఎప్పటికప్పుడు చర్చ జరుగుతూనే ఉంది. వైసీపీ హయాంలో అమలులోకి వచ్చిన ఈ వ్యవస్థ గ్రామాలు, పట్టణాల్లో సంక్షేమ పథకాల అమలులో కీలక భూమిక పోషించిందని చెప్పాలి. ఈ కారణంగా తాము అధికారంలోకి వచ్చినా కూడా వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని మొన్నటి ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత, ప్రస్తుత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వలంటీర్లకు హామీ ఇచ్చారు. అంతేకాకుండా అప్పటిదాక వలంటీర్లకు ఇస్తున్న రూ.5 వేల వేతనాన్ని డబుల్ చేసి రూ.10 వేలు ఇస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు.

అనుకున్నట్లుగానే టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చింది. అయితే వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామన్న చంద్రబాబు హామీ మాత్రం అమలు కాలేదు. దీనిపై ఎవరి వాదన వారే వినిపిస్తున్నారు. వలంటీర్లు మాత్రం తమకు జీవనోపాధి చూపాలంటూ నిరసనలకు దిగుతున్నారు. ఇలాంటి క్రమంలో వలంటీర్లను వంచించిందెవరన్న విషయంపై ఎప్పటికప్పుడు కొత్త చర్చ జరుగుతూనే ఉంది. ఈ చర్చకు ఫుల్ స్టాప్ పడేలా జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు.

సోమ, మంగళవారాల్లో అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటించిన సందర్భంగా మంగళవారం అరకు వెళ్లిన పవన్ కల్యాణ్ ను పలువురు వలంటీర్లు కలిశారు. ఈ సందర్భంగా ఎన్నికల ముందు కూటమి పార్టీలు తమకు ఇచ్చిన హామీలను వారు గుర్తు చేశారు. ఈ సందర్భంగా వారికి ఓపిగ్గా సమాధానం చెప్పిన పవన్… తప్పు ఎక్కడ జరిగిందన్న దానిని వివరంగా తెలియజేశారు. కూటమి సర్కారు వలంటీర్ వ్యవస్థను కొనసాగించడానికే సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.

ఈ దిశగా ఇప్పటిదాకా జరిగిన కేబినెట్ సమావేశాల్లో పలుమార్లు దీనిపై చర్చ జరిగిందని కూడా ఆయన తెలిపారు. స్వయంగా తానే రెండు, మూడు పర్యాయాలు కేబినెట్ సమావేశాల్లో వలంటీర్ వ్యవస్థ గురించి ప్రస్తావించాననీ పవన్ చెప్పుకొచ్చారు. అయితే ఏ రకంగానూ వలంటీర్ వ్యవస్థను కొనసాగించడానికి వీల్లేని పరిస్థితులు తమ చేతులను కట్టేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు దారి తీసిన పరిస్థితులు, గతంలో ఏం జరిగింది? ఇప్పుడు జరుగుతున్నదేమిటి?… అసలు వలంటీర్లను నిండా ముంచేసింది ఎవరన్న విషయాలను నిర్మగర్భంగానే పవన్ వారికి వివరించారు.

వలంటీర్ వ్యవస్థను వైసీపీ ప్రభుత్వమే వంచించిందని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు వలంటీర్లను నియమించుకున్న వైసీపీ ప్రభుత్వం వారితో పనిచేయించుకుందే గానీ… వారి భవిష్యత్తు గురించి ఆలోచించలేదని ఆరోపించారు. ఈ కారణంగానే వలంటీర్ వ్యవస్థకు అధికారిక ముద్ర వేయలేదని ఆయన తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వంలోని ఏ ఒక్క శాఖ వద్ద కూడా వలంటీర్ వ్యవస్థ గురించి ఒక్కటంటే ఒక్క పత్రం కూడా లేదన్నారు.

అసలు వలంటీర్లకు వేతనాలను కూడా వైసీపీ సర్కారు ప్రభుత్వం ద్వారా ఇవ్వలేదని ఆయన తేల్చి చెప్పారు. వలంటీర్లను ఏ రీతిన కూడా ప్రభుత్వానికి సంబంధం లేకుండానే వైసీపీ ప్రభుత్వం చేసిందన్నారు. అసలు ఈ వ్యవస్థకు సంబంధించిన పేపర్ వర్కే జరగలేదని ఆయన తెలిపారు. వలంటీర్లకు ఉద్యోగాలు ఇస్తున్నట్లుగా వైసీపీ జీవోనే ఇవ్వలేదన్నారు. వలంటీర్ ఉద్యోగం కూడా ప్రభుత్వ ఉద్యోగమేనన్న భ్రమల్లో వలంటీర్లను వైసీపీ అలా ఉంచేసిందని కూడా ఆయన తెలిపారు. వెరసి అడుగడుగునా వలంటీర్లను వైసీపీ ప్రభుత్వం వంచనకు గురి చేసిందని పవన్ తేల్చి చెప్పారు.