ఏపీ వృద్ధి రేటులో దూసుకుపోతోంది. కూటమి పాలనలో గడచిన 10 నెలల్లోనే ఏపీ గణనీయ వృద్ధి రేటును సాధించింది. దేశంలోని అత్యధిక వృద్ధి రేటును నమోదు చేస్తున్న రాష్ట్రాల జాబితాలో ఏకంగా రెండో స్థానంలో నిలిచింది. అంతేకాకుడా కేవలం ఏడాది వ్యవధిలో రాష్ట్రం తన వృద్ధి రేటును ఏకంగా 2 శాతానికి మించి వృద్ధి రేటును నమోదు చేసింది. అప్పుల్లో ఉన్న రాష్ట్రం ఈ వృద్ధిని నమోదు చేయడం నిజంగానే ఆశ్చర్యమేనని చెప్పాలి. ఇదే దూకుడును కొనసాగిస్తే… త్వరలో రాష్ట్రం వృద్ధి రేటులో దేశంలోనే నెంబర్ వన్ స్టానంలో నిలవడం ఖాయమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.
2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన గణాంకాలను కేంద్రం తాజాగా విడుదల చేసింది. ఈ గణాంకాల్లో తనదైన దూకుడు ప్రదర్శించిన తమిళనాడు అగ్రస్థానంలో నిలిచింది. తమిళనాడు తర్వాత స్థానంలో ఏపీ నిలిచింది. అత్యధికంగా 9.69 శాతం వృద్ది రేటుతో తమిళనాడు తొలి స్థానంలో నిలిచింది. అదే సమయంలో 8.21 వృద్ది రేటుతో ఏపీ రెండో స్థానంలో నిలిచింది. ఇక్కడ ఓ ముఖ్యమైన విషయాన్ని గ్రహించాల్సి ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 6.19 శాతం వృద్ది రేటును నమోదు చేసిన ఏపీ గడచిన ఏడాదిలో 2 శాతానికి పైబడి వృద్ది రేటును పెంచుకోవడం గమనార్హం.
ఈ గణాంకాలను చూసిన టీడీపీ అదినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు హర్షం వ్యక్తం చేశారు. గడచిన 10 నెలల కాలంలోనే విధ్వంసకర పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించగలిగామని ఆయన సోషల్ మీడియా వేదికగా తన ఆనందాతిశయాన్ని ప్రకటించారు. వ్యవసాయం, ఉత్పత్తి రంగం, సేవల రంగాల్లో విశేష పురోగతి సాధించామన్న ఆయన…ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, రెన్యూవబుల్ ఎనర్జీ రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులను సాధించడంతోనే రాష్ట్ర వృద్ధిరేటు పెరుగుదలకు దోహదపడిందని ఆయన అబిప్రాయపడ్దారు. ఇదే జోరును కొనసాగిస్తూ ముందుకు సాగుదామని.. రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలబెడదామని ఆయన రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు.