విమర్శల సుడిలో మీనాక్షి… ఏం జరిగింది?

మీనాక్షి నటరాజన్… .పేరు ఎక్కడో విన్నట్టు ఉంది కదా. నిజమే… ఇటీవలే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జీగా బాధ్యతలు చేపట్టి తనదైన మార్కును చూపిన కాంగ్రెస్ పార్టీ నేతనే మీనాక్షి నటరాజన్. మధ్య ప్రదేశ్ కు చెందిన ఈ కాంగ్రెస్ మాజీ ఎంపీ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ బృందంలో సభ్యురాలు. కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్ యూఐ నుంచి వచ్చిన ఈ మహిళా నేత ఆడంబరాలకు ఆమడ దూరం ఉండే నేతనే గానీ… వ్యవహారం చూస్తే పెద్దగా ప్రొటోకాల్ పంచాయతులేమీ తెలియనట్టుగానే ఉంది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇంచార్జీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన రెండో టూర్ లోనే మీనాక్షి చుట్టూ విమర్శల జడివాన మొదలైంది.

అసలేం జరిగిందన్న విషయానికి వస్తే… ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని 400 ఎకరాల భూమి వ్యవహారం మీద ఓ పెద్ద పంచాయతీ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇటు తెలంగాణ హైకోర్టుతో పాటు అటు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు జారీ చేస్తే గానీ…ఆ 400 ఎకరాల చదును, చెట్లు కొట్టే కార్యక్రమాలు ఆగలేదు. ఈ వ్యవహారంతో తెలంగాణలోని అదికార కాంగ్రెస్ కు ఒకింత చెడ్డ పేరు అయితే వచ్చిందనే చెప్పాలి. ఈ విషయాన్ని గ్రహించిన కాంగ్రెస్ అధిష్ఠానం ఆ కథేమిటో కాస్త చూడండి అంటూ మీనాక్షికి సూచించిందట. అంతే శనివారం హైదరాబాద్ లో అడుగుపెట్టిన నటరాజన్… నేరుగా సచివాలయంలో జరుగుతున్న మంత్రుల సమావేశానికి హాజరయ్యారట.

అంతే… ఇలా మీనాక్షి నటరాజన్ సచివాలయంలోకి అడుగుపెట్టారో, లేదో…ఏ హోదాలో మీనాక్షి సచివాలయంలో జరిగిన మంత్రుల సమావేశానికి హాజరవుతారంటూ నెటిజన్లు పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే అంతేలే.. ఆ పార్టీ నేతలకు అసలు ప్రొటోకాలే గుర్తుకు రాదు. హైదరాబాద్ లో నిర్వహించాల్సిన సమావేశాలు డిల్లీలో పెడతారు, గాంధీ భవన్ లో నిర్వహించాల్సిన సమావేశాలను సచివాలయంలో పెడతారంటూ సెటైర్లు పడిపోతున్నాయి. అంతేకాకుండా సచివాలయంలో సమీక్షలు పెట్టాల్సిన సీఎం రేవంత్ రెడ్డి. వాటిని కమాండ్ కంట్రోల్ లో పెడుతుంటే.. ఎక్కడో గాంధీ భవన్ లో జరగాల్సిన కాంగ్రెస్ పార్టీ మీటింగులు సచివాలయంలో జరుగుతాయి అంటూ కూడా కొందరు కామెంట్లు పెడుతున్నారు.