తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఈ నెల 15న మరోమారు విదేశీ పర్యటనకు వెళుతున్నారు. సీఎం హోదాలో ఇప్పటికే దావోస్, సింగపూర్ లలో పర్యటించిన రేవంత్… ఇప్పుడు జపాన్ పర్యటనకు వెళుతున్నారు. సింగపూర్, దావోస్ పర్యటనలను వారం వ్యవధిలోనే ముగించుకుని వచ్చిన రేవంత్ రెడ్డి.. జపాన్ టూర్ ను మాత్రం ఏకంగా 8 రోజుల పాటు కొనసాగించనున్నారు. ఈ లెక్కన భారీ లక్ష్యాలనే పెట్టుకుని రేవంత్ జపాన్ టూర్ కు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లుగా సమాచారం. తెలుగు రాష్ట్రాల సీఎంలు ఎప్పుడు విదేశీ పర్యటనలకు వెళ్లినా తమ తమ రాష్ట్రాలకు పెట్టుబడులను రాబట్టేందుకే వెళతారు కదా.. జపాన్ టూర్ లోనూ రేవంత్ ఇదే లక్ష్యంతో సాగనున్నారు.
మొన్నటిదాకా ప్రపంచం ఐటీ (ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ) జపం చేస్తే… ఇప్పుడు అందరూ ఏఐ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) జపం చేస్తున్నారు. టెక్నాలజీ రంగంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఏఐ కేంద్రంగానే పెట్టుబడులు పెడుతున్నారు. ఏఐ ఆధారంగానే ప్రతి అంశంపై చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి క్రమంలో వర్తమానంలో ఏ సాంకేతికత అయితే వినియోగంలో ఉందో… దానిలోనే యువతకు శిక్షణ ఇవ్వాలని రేవంత్ భావిస్తున్నారు. ఇందుకోసం ఆయన ఏకంగా స్కిల్ యూనివర్సిటీకే శ్రీకారం చుట్టారు. ఈ వర్సిటీలో ఆయా సాధారణ డిగ్రీలు చేసిన వారికి అధునాతక టెక్నాలజీల్లో శిక్షణ ఇచ్చి.. వారికి ఉపాధి దక్కేలా చేయాలని రేవంత్ భావిస్తున్నారు. ఇప్పుడు జపాన్ పర్యటన కూడా సాంతం దీనిపైనే ఆధారపడి సాగుతోందని తెలుస్తోంది.
ఏఐలో ఇప్పుడు జపాన్ శరవేగంగా దూసుకువెళుతోందట. దీంతో జపాన్ లో పర్యటించి… అక్కడి ఏఐ సంస్థలు, అక్కడి ప్రభుత్వాలతో చర్చలు జరపాలన్న దిశగా రేవంత్ జపాన్ వెళుతున్నారు. అంతేకాకుండా ఏఐ రంగంలో తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించే నిమిత్తం కూడా జపాన్ లో రేవంత్ బృందం పలు సమావేశాలు నిర్వహించనున్నట్లు సమాచారం. ఇక స్కిల్ యూనివర్సిటీకి సాంకేతికంగా సహకారం అందించడం ద్వారా తెలంగాణ యువతలో మరింత మేర నైపుణ్యాలను అభివృద్ధి చేసే దిశగా జపాన్ ప్రభుత్వంతో పాటు అక్కడి సంస్థలను ఒప్పించే దిశగా రేవంత్ బృందం కృషి చేయనుందట. రేవంత్ బృందంలో ఐటీ శాఖ మంత్రి హోదాల దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ లు అయితే తప్పనిసరిగా ఉంటారని సమాచారం. వీరితో పాటు ఇంకెవరు వెళతారన్నది త్వరలోనే వెల్లడి కానుంది.