‘వక్ఫ్’పై వైసీపీ డబుల్ గేమ్ ఆడిందా..?

దేశంలోని మెజారిటీ ముస్లిం మైనారిటీలు వ్యతిరేకించిన వక్ఫ్ సవరణ బిల్లుకు పార్లమెంటు ఆమోద ముద్ర వేసింది. రాష్ట్రపతి ఈ బిల్లుపై సంతకం చేసేస్తే… బిల్లు చట్టంగా మారిపోతుంది. ఇలాంటి తరుణంలో ఏపీలోని రాజకీయ పార్టీల మధ్య శుక్రవారం ఓ విషయంపై పెద్ద రచ్చకు తెర లేసింది. అధికారి కూటమి.. అందులోనూ కూటమి కీలక భాగస్వామి టీడీపీ, విపక్ష వైసీపీల మధ్య ఈ రచ్చ ఓ రేంజిలో సాగుతోంది. వక్ఫ్ సవరణ బిల్లుకు టీడీపీ అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లుగా ప్రకటించి ఆ మేరకే పార్లమెంటులో వ్యవహరించింది. అదే సమయంలో బిల్లుకు తాము వ్యతిరేకమని చెప్పిన వైసీపీ..లోక్ సభలో ఓ మాదిరిగా, రాజ్యసభలో మరోమాదిరిగా వ్యవహరించిందన్న విషయంపై రచ్చ కొనసాగుతోంది.

టీడీపీ…కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏలో కీలక భాగస్వామిగా కొనసాగుతోంది. ఎన్డీఏలో అత్యదిక సంఖ్యలో ఎంపీలు కలిగిన పార్టీల్లో బీజేపీ తరువాతి స్థానం టీడీపీదే. ఇక ఏపీలోనూ బీజేపీతో పొత్తుతోనే టీడీపీ ఎన్నికలకు వెళ్లింది. ఇటు రాష్ట్రంలో పాటు అటు కేంద్రంలోనూ ఇప్పుడు ఈ పార్టీల ప్రభుత్వాలే ఉన్నాయి. ఎన్డీఏ కేబినెట్ లో టీడీపీ ఎంపీలు ఉండగా .ఏపీలోని కూటమి కేబినెట్ లో బీజేపీ ఎమ్మెల్యేలూ ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో ఎన్డీఏ బిల్లును వ్యతిరేకించే అవకాశం టీడీపీకి లేదు. ఈ విషయాన్ని పసిగట్టిన టీడీపీ… వక్ఫ్ సవరణ బిల్లులో పలు మార్పులను ప్రస్తావించింది. ఆ అంశాల్లో తాను సూచించిన అంశాల్లో మార్పులూ చేయించింది. ఫలితంగా మైనారిటీల పక్షాన తాను నిలబడినట్టుగా టీడీపీ నిరూపించుకుంది. ఇక గుడ్డి వాదనలు చేసే వర్గాలను ఆ పార్టీ వదిలేసిందనే చెప్పాలి.

వైసీపీ పరిస్థితి భిన్నంగా ఉంది. ఏపీలో అదికారంలో ఉన్నంతకాలం ఎన్డీఏతో మిత్రపక్షంగా సాగిన వైసీపీ.. ఎప్పుడైతే విపక్షంగా మారిందో అప్పుడే బీజేపీకి దూరంగా జరిగింది. అంతేకాకుండా టీడీపీతో బీజేపీ జట్టు కట్టడం కూడా వైసీపీ నయా వైఖరికి కారణమని కూడా చెప్పాలి. టీడీపీ జతకూడిందన్న కారణమే గానీ..కేంద్రంలో ఉన్న ఎన్డీఏను వైసీపీ ఎలాంటి పరిస్థితిలోనూ వ్యతిరేకించే అవకాశమే లేదు. ఈ తరహా పరిస్థితికి చాలా కారణాలే ఉన్నాయన్న వాదనలు బలంగానే వినిపిస్తున్నాయి. మొత్తంగా అటు ముందుకు దూకలేక, ఇటు వెనక్కు గెంతలేక వైసీపీ ఆపసోపాలు పడుతోందని టీడీపీ ఆరోపిస్తోంది. అదే వైఖరిని వైసీపీ వక్ఫ్ బిల్లు విషయంలోనూ చూపిందని కూడా టీడీపీ వాదిస్తోంది.

వక్ఫ్ సవరణ బిల్లుకు తాను వ్యతిరేకమని వైసీపీ ఆదిలోనే ప్రకటించింది. అందుకు అనుగుణంగానే బిల్లు లోక్ సభకు వచ్చినప్పుడు వైసీపీ నేత మిథున్ రెడ్డి బిల్లును వ్యతిరేకించారు. వైసీపీకి ఉన్న నలుగురు ఎంపీలు బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశారు. ఇక్కడిదాకా బాగానే ఉన్నా…రాజ్యసభకు బిల్లు వచ్చిన సందర్బంగా వైసీపీ తన వైఖరికి బిన్నంగా వ్యవహరించిందట. బిల్లును సభలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి వ్యతిరేకిస్తున్నట్లుగా ప్రకటించారు. అయితే ఆ తర్వాత ఓటింగ్ విషయంలో తమ ఏడుగురు సభ్యులకు వారి ఇష్టానుసారం ఓటేసేందుకు అనుమతించారట. ఫలితంగా వక్ఫ్ బిల్లుకు మొత్తం ఏడుగురు సభ్యులు అనుకూలంగానే ఓటేశారట. ఫలితంగా రాజ్యసభలో బొటాటోటీ మెజారిటీ ఉన్న ఎన్డీఏ బిల్లును పాస్ చేయించుకోగలిగిందట. అయితే టీడీపీ చేస్తున్న ఈ వాదనను వైసీపీ కొట్టేస్తోంది. ఈ క్రమంలో ఇరు వర్గాలు తమతమ వాదనలను బయటపెడుతూ పరస్పరం ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి.