వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో మొదలైన పార్టీ వైసీపీ..ఎందరో నేతలను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది. కొందరిని అసెంబ్లీలోకి అడుగుపెట్టిస్తే… మరికొందరిని ఏకంగా పార్లమెంటు గడపనే తొక్కేలా చేసింది. అదే సమయంలో చాలామంది నేతల రాజకీయ నేతల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసిందని చెప్పాలి. ఈ కోవకు చెందిన నేతలతో పాటుగా వారి వారసుల ఆశలను కూడా చిదిమేసిందనే చెప్పాలి.
ఈ జాబితాలో ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరు నేతలను ప్రధానంగా చెప్పుకోవాలి. వారే సీనియర్ రాజకీయవేత్తలు, మాజీ మంత్రులు కరణం బలరామ కృష్ణమూర్తి, శిద్ధా రాఘవ రావు. వీరిద్దరూ దాదాపుగా రాజకీయాల నుంచి తప్పుకుని తమ వారసులను రంగంలోకి దించుదామనుకుంటున్న క్రమంలో వీరి ప్రస్థానాన్ని వైసీపీ ప్రశ్నార్థకం చేసింది.
కరణం బలరామకృష్ణమూర్తి… ప్రకాశం జిల్లాలోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పరిచయం అక్కర్లేని నేత. కాంగ్రెస్ తో రాజకీయం మొదలుపెట్టినా టీడీపీ నేతగానే కరణం గుర్తింపు పొందారు. టీడీపీలో సీనియర్ మోస్ట్ నేతగా ఎదిగారు. అటు పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ తో పాటు ఇటు పార్టీని దశాబ్దాల తరబడి కొనసాగేలా పటిష్టపరచిన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడి తోనూ సత్సంబంధాలు నెరపిన నేతగా కరణానికి పేరుంది. ఇక ప్రకాశం జిల్లాలో టీడీపీకి పెద్ద దిక్కుగా కూడా వ్యవహరించిన సందర్భాలు కోకొల్లలు.
ఐదు సార్లు ఎమ్మెల్యేగా, ఓ దఫా ఎంపీగా, ఓ దఫా ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టిన కరణం రాజకీయం సుదీర్ఘంగా సాగింది. కొంతకాలం క్రితం కుమారుడు వెంకటేశ్ ను రాజకీయాల్లోకి తీసుకుని వచ్చి విశ్రాంతి తీసుకుందామని భావించిన ఆయనకు అనుకోని పరిస్తితులు ఎదురు కాగా… వాటి నుంచి తప్పించుకుని కుమారుడిని నిలబబెట్టడమే లక్ష్యంగా వైసీపీలోకి చేరిపోయారు.
అంతే… వైసీపీలో కరణం లాక్ అయిపోయారు. వెంకటేశ్ రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పోటీ చేసినా విజయం దరి చేరకపోవడం, కుమారుడు ఓడినా కరణం ఎమ్మెల్యేగా గెలిచిన తీరు, ఆపై వైసీపీలోకి రాగానే ఎమ్మెల్సీ పదవి.. ఇప్పుడు ఎటు అడుగు వేయాలో తెలియని సందిగ్ధంలో కరణం కూరుకుపోయారు. టీడీపీలో ఓ రేంజి నేతగా ఎదిగిన కరణం పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీని వీడారు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని తిరిగి టీడీపీలోకి అడుగుపెట్టాలన్న దిశగా కరణం నలిగిపోతున్నారు.
ఇక తనకు రాజకీయ ఓనమాలు నేర్పిన కాంగ్రెస్ పార్టీ ఏపీలో అసలు గమనంలోనే లేదు. మరేం చేయాలి? అదే అర్థం కాక తప్పనిసరి పరిస్థితుల్లో కరణం ఫ్యామిలీ వైసీపీలోనే కొనసాగుతోంది. అసలు తమ భవిష్యత్తు ఏమిటో కూడా అర్థం కాక కరణం ఫ్యామిలీ తల పట్టుకుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఇక శిద్దా రాఘవరావు తొలుత ఓ బిజినెస్ మ్యాన్. వ్యాపారంలో ఆరితేరిపోయారు. టీడీపీ అదినేత చంద్రబాబుతో మంచి సంబంధాలున్నాయి.1999లో టీడీపీతో తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన శిద్దా పార్టీ నిర్మాణంలో కీలక భూమిక పోషించారు. చాలా కాలం పాటు ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంటూనే సాగారు. ఉమ్మడి రాష్ట్రంలో ఓ దఫా ఎమ్మెల్సీగా పనిచేశారు. ఇక తెలుగు నేల విభజన తర్వాత తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించి… చంద్రబాబు కేబినెట్ లో మంత్రి పదవిని చేజిక్కించుకున్నారు.
అయితే 2019 ఎన్నికలు ఆయన రాజకీయ భవితవ్యాన్ని డోలాయమానంలో పడేసింది. అప్పటికే అటు వ్యాపారం, ఇటు రాజకీయాల్లో సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన శిద్ధా… కుమారుడికి రాజకీయ వారసత్వం ఇచ్చేసి తప్పుకుందామని భావించారు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమిపాలు ఆయన ఆశలను ఛిద్రం చేసింది.
ఎంతైనా వ్యాపారి కదా. ఏదో లావాదేవీలు, కుమారుడిని రాజకీయంగా నిలబెట్టుకోవాలన్న బలమైన కాంక్ష టీడీపీ నుంచి శిద్దాను బయటకు పడేసింది. వైసీపీలో చేరేలా చేసింది. కుమారుడు శిద్ధా వెంకట సుధీర్ కుమార్ తో కలిసి ఆయన వైసీపీలో చేరారు. అయితే వైసీపీలో శిద్ధాకు ఆశించినంతగా ప్రాధాన్యం ఏమీ దక్కలేదు. వెంకట సుధీర్ కుమార్ కు 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేందుకు జగన్ ససేమిరా అన్నారు. కనీసం తనకు అయినా ఇవ్వాలని రాఘవరావు చేసిన వినతికి కూడా జగన్ నుంచి ఆశించిన స్పందన లభించలేదు.
నాడు అధికార పార్టీగా, 151 మంది ఎమ్మెల్యేలున్న పార్టీగా ఉన్న వైసీపీపై ఒత్తిడి తీసుకువచ్చే అవకాశమే లేకుండాపోయింది. అయితే 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలు కావడంతో శిద్ధా రాఘవరావు ఏం చేయాలో కూడా పాలుపోలేదు. కరణం మాదిరే టీడీపీకి బ్యాక్ టూ పెవిలియన్ కు వెళ్లేందుకు శిద్ధా మనసు ఒప్పుకోవడం లేదట. వెరసి ఇటు శిద్ధా, అటు కరణం ఫ్యామిలీలు వైసీపీలో ప్రవేశించి… తమ రాజకీయ ప్రస్థానాన్ని ప్రశ్నార్థకం చేసుకున్నాయని చెప్పాలి.