అవినీతి మకిలి అంటకుండా సాగితే…అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా కడుపులో చల్ల కదలకుండా నిర్భయంగా ఉండొచ్చు. అదే అవినీతిలో నిండా మునిగి తేలితే.. అదికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా నిత్యం భయంభయంగానే సాగాలి. అధికారంలో ఉన్నప్పుడు ఈ మకిలీని ఎలాగోలా కప్పిపుచ్చినా…విపక్షంలో చేరితే మాత్రం దాయడం, దాని నుంచి దూరంగా జరగడం కుదరదు కదా. అధికారంలో ఉండగా…ఎంచక్కా జల్సాల కోసం తీర్చిదిద్దుకున్న ప్రత్యేక ఏర్పాట్లనూ ఎంజాయ్ చేయలేని దుస్థితి దాపురిస్తుంది. ఈ తరహా దుస్థితిని ఇప్పుడు వైసీపీ యువనేత, శ్రీసత్యసాయి జిల్లా పరిధిలోని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి వద్ద ప్రత్యక్షంగా చూడొచ్చు.
వైసీపీ అదికారంలో ఉండగా…. కేతిరెడ్డి ధర్మవరం ఎమ్మెల్యే హోదాలో దర్జాగా కాలం వెళ్లదీశారు. ఉదయాన్నే మార్నింగ్ వాక్ అంటూ ట్రాక్ సూట్ వేసుకుని వీడియోగ్రాఫర్ ను వెంటేసుకుని బయలుదేరేవారు. జనాన్ని పలకరించుకుంటూ అలా సాగిపోయిన ఆయన వీడియోలు జనాన్ని ఇట్టే ఆకట్టుకున్నాయి. కేతిరెడ్డి లాగా తమ ఎమ్మెల్యేలు ఎందుకు లేరంటూ చాలామంది అనుకున్నారంటే… ఆయన ఏ రీతిన జనాలను ఇంప్రెస్ చేశారో ఇట్టే చెప్పేయొచ్చు. ఇదంతా నాణేనికి ఓ వైపు అయితే… గుట్టుచప్పుడు కాకుండా కేతిరెడ్డి మహారాజాలా దర్జాగా విలాసాలను ఎంజాయ్ చేసిన తీరు ఆయనతో పాటు ఆయన పార్టీ ఓడిపోయినంతనే వెలుగులోకి వచ్చాయి. పూర్వకాలంలో రాజుల మాదిరిగా గుర్రాల కోటలను ఏర్పాటు చేసుకున్న కేతిరెడ్డి… నిత్యం గుర్పపు స్వారీలు, నీటిలో సఫారీలు చేస్తూ ఎంజాయ్ చేశారట.
సరే… కేతిరెడ్ది విలాసాలు ఆయన ఇష్టం అనుకున్నా ఓకే. అయితే కేతిరెడ్డి ఈ విలాసాలను ఏర్పాటు చేసుకున్నది ఆయన కష్టపడి సంపాదించిన స్థలంలో కాదట. ధర్మవరం సమీపంలో ఓ చెరువు ఉంటే.. దానిని ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమిని తొలుత కొందరి పేర్లపైకి ఎక్కించి.. వారి నుంచి తాను కొనుగోలు చేసినట్లు పత్రాలను సృష్టించుకుని ఆయన ఆ స్థలాన్ని ఆక్రమించారట. ఈ స్థలంలోనే గుర్రాల కోట లాంటి గెస్ట్ హౌస్ ను ఏర్పాటు చేసుకున్న కేతిరెడ్డి… అందులోనే తన విలాసాలను తీర్చుకునేవారట. వైసీపీ అదికారం నుంచి దిగిపోగానే… కేతిరెడ్డి చీకటి కోణాలన్ని ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. విషయం కోర్టుల దాకా వెళ్లింది. అంతే.. గుర్రాల కోటకు కేతిరెడ్డి తాళం వేసేశారు. ఈ వ్యవహారాన్ని తేల్చుకునే దాకా గుర్రాలకోటకు తాళం వేసిన కేతిరెడ్డి…నేరుగా హైకోర్టును ఆశ్రయించగా… ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలంటూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసి విలాసాల వైసీపీ నేతకు షాకిచ్చింది.
కోర్టు ఆదేశాల మేరకు ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన రెవెన్యూ అదికారులు… తొలుత ఈ స్థల యజమానిగా ఉన్న కేతిరెడ్డి సోదరుడి సతీమణికి పోస్టు ద్వారా నోటీసులు పంపారట. అయితే గుర్రాల కోట అడ్రెస్ ను తప్పుగా పేర్కొన్నారో, లేదంటే గుర్రాల కోటలో ఆ నోటీసులు స్వీకరించేందుకు ఎవరూ లేరో తెలియదు గానీ..అవి తిరుగు టపాలో రెవెన్యూ అదికారులకే వచ్చాయట. దీంతో చేసేది లేక శుక్రవారం స్వయంగా రెవెన్యూ అదికారులే ఆ నోటీసులను తీసుకుని గుర్రాల కోటకు వెళ్లారట. అయితే గుర్రాల కోటకు తాళం కప్ప దర్శనమివ్వడంతో తపాలా కవర్ మాదిరే రెవెన్యూ అదికారులు కూడా ఆ నోటీసులు అందించకుండానే.. తిరుగు ప్రయాణం అయ్యారట. మరి ఈ కోటకు కేతిరెడ్డి ఎప్పుడు తాళాలు తీస్తారో, ఏమో మరి.