కేసీఆర్ సంచలన నిర్ణయం.. వరద సాయం బంద్

ఏదో అనుకుంటే మరేదో అయినట్లుగా మారింది కేసీఆర్ సర్కారు అంచనా. ఇటీవల కురిసిన భారీ వర్షాలు..వరదల కారణంగా భారీగా నష్టపోయిన హైదరాబాదీయుల్ని ఆదుకునేందుకు చరిత్రలో మరే ప్రభుత్వం చేపట్టని రీతిలో నష్టపరిహారాన్ని అందజేయాలని భావించారు.

తొలిదశలో వరద కారణంగా ప్రభావితమైన ప్రతి కుటుంబానికి రూ.10వేలు చొప్పున పరిహారం అందజేయాలని.. తర్వాతి దశలో బాధితులు నష్టపోయిన దానికి తగ్గట్లు రూ.50వేలు.. రూ.లక్ష మొత్తాల్ని చెల్లించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి భారీ ఎత్తున అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది.

యుద్ధ ప్రాతిపదికన నిధులు సమకూర్చారు. తాము ఇస్తున్న పరిహారంతో ప్రభుత్వ ఇమేజ్ భారీగా పెరగటమే కాదు.. త్వరలో జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పాజిటివ్ గా మారటానికి ఉపయోగపడుతుందని అంచనా వేసినట్లుగాచెబుతారు. దీనికి భిన్నంగా.. స్థానిక నేతలు.. కార్పొరేటర్లు.. కొందరు అధికారులు ప్రదర్శించి కక్కుర్తి కారణంగా పరిహారం కాస్తా పెద్ద ప్రహసనంగా మారింది. వరద బాధితులకుఅందాల్సిన సాయం పక్కదారిపట్టటమే కాదు.. పలు విమర్శలకు.. ఆరోపణలకు తావిచ్చింది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. తొలుత అనుకున్నట్లుగా 3.91 లక్షల కుటుంబాలకు పరిహారం అందించాలని భావించారు. ఈ క్రమంలో ఇప్పటివరకు 3.2లక్షల కుటుంబాలకు సాయం అందించినా..వాస్తవ బాధితుల్లో ఈ సాయం అందింది కేవలం 40 శాతమేనని చెబుతున్నారు. అదే సమయంలో.. తొలుత అనుకున్నదాని కంటే ఎక్కువగా బాధిత కుటుంబాలు పెరిగిపోతున్న వైనం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. పరిహారం కోసం ప్రభుత్వం రూ.550 కోట్లు కేటాయించింది. వందల కోట్లు ఖర్చు పెడుతున్నా రావాల్సిన మైలేజీ తర్వాత.. అసలుకే ఎసరు అన్నట్లుగా జరుగుతున్న రచ్చ ప్రభుత్వాన్ని ఆలోచనల్లో పడేసినట్లు చెబుతున్నారు.

అందుకే.. ఇప్పుడు అందిస్తున్న పరిహారాన్ని తాత్కాలికంగా బంద్ చేయాలని.. ఇప్పటికి అందించిన సాయానికి సంబంధించి లెక్కల్ని క్రాస్ చెక్ చేయాలని భావిస్తున్టన్లు చెబుతున్నారు. పరిహారం కింద అందించిన రూ.10వేల సాయం అసలైన బాధితులకు అందిందా? లేదా? అన్న విషయాన్ని లెక్క తేల్చే పని మొదలు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. పరిహారాన్ని అందించే క్రమంలో బాధితుల వద్ద నుంచి ఆధార్ కార్డు సేకరించారు. వీటిని ర్యాండమ్ గా చెక్ చేసి.. లెక్కలో తేడా ఉంటే.. మరింత లోతుల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. ఈ లెక్కలు తేలే వరకు పరిహారాన్ని పంపిణీ చేయకుండా ఆపేయాలన్న సంచలన నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది.

అదే సమయంలో.. ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని బాధితులకు అందకుండా చేతివాటం ప్రదర్శించిన నేతల్ని.. అధికారుల్ని గుర్తించాలన్న పట్టుదలతో ప్రభుత్వం ఉందంటున్నారు. ఇప్పటికే పరిహారం అందిన వారి సంగతి ఓకే కానీ.. పరిహారం కోసం ఎదురుచూస్తున్నవారికి ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయానికి ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.