రేవంత్ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు అభ్యంతరం

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. అసెంబ్లీ వేదికగా ఉప ఎన్నికలు రావంటూ రేవంత్ వ్యాఖ్యలు చేసి ఉంటే… అవి రాజ్యాంగాన్ని అపహాస్యం చేసినట్టుగానే భావించాల్సి వస్తుందని కూడా సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ మేరకు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్టి మసీలతో కూడిన ధర్మాసనం రేవంత్ వ్యాఖ్యలను తప్పుబడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి చేరగా… వారిపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై బుధవారం కూడా విచారణ జరిగిన సందర్భంగా రేవంత్ వ్యాఖ్యలను ధర్మాసనం ప్రస్తావించింది.

ఒక పార్టీ టికెట్ పై ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన సభ్యులు మరో పార్టీలో చేరకుండా నిరోధించేందుకే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఉంది. ఈ చట్టాన్ని ఉల్లంఘించేలా పది మంది బీఆర్ఎస్ సభ్యులు తమ పార్టీని వదిలి అధికార కాంగ్రెస్ లో చేరారన్నది బీఆర్ఎస్ వాదన. దీనిపై స్పీకర్ గెడ్డం ప్రసాద్ కుమార్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు చేయగా…ఆయన సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటానని బదులిచ్చారు. దీంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా పలువురు ఆ పార్టీ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లంటిపై విచారణ చేపట్టిన కోర్టు ఇప్పటికే పలు దఫాలుగా విచారించింది. తాజాగా బుధవారం విచారణ జరగగా… పిటిషనర్ల తరఫు న్యాయవాది ఆర్యమన్ సుందరమ్.. అసెంబ్లీలో రేవంత్ చేసిన వ్యాఖ్యలను కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

పార్టీలు మారిన ఎమ్మెల్యేల స్థానాలకు ఉప ఎన్నికలు వచ్చే సమస్యే లేదని ఇటీవలి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా రేవంత్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటే… పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఆయన అపహాస్యం చేసినట్టేనని కోర్టు వ్యాఖ్యానించింది. అంతటితో ఆగని కోర్టు… తెలంగాణ సర్కారు తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ తీరుపైనా అసంతృప్తి వ్యక్తం చేసింది. సీఎం ఈ తరహా వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్న కోర్టు.. ఈ తరహా వ్యాఖ్యలపై కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసే అవకాశాలున్నాయని అభిప్రాయపడింది. ప్రస్తుతం కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసే విషయంలో తాము ఒకింత ఆలస్యంగా స్పందిస్తున్నామన్న భావన ఉందన్న ధర్మాసనం.. ఆ నోటీసులు జారీ చేసే అధికారం తమకు ఉందని గుర్తుంచుకోవాలని హెచ్చరించింది.