గీతం’ వెంటపడిన వైసీపీ ఎంపి

వైసీపీ రాజ్యసభ ఎంపి విజయసాయిరెడ్డి విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటి యాజమాన్యం వెంట పడ్డారు. 40 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వివాదంలో యాజమాన్యం బాగా వివాదాస్పదమైన విషయం అందరికీ తెలిసిందే. ప్రభుత్వ భూమిని ఆక్రమించిన కేసులో ఇరుక్కున్న యాజమాన్యంపై ఎంపి నేషనల్ మెడికల్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుతో ఆగని ఎంపి తాజాగా కేంద్రం వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి రమేష్ పోక్రియాల్, యూజీసీ ఛైర్యన్ ధీరేంద్ర పాల్ సింగ్ కు కూడా ఫిర్యాదు చేయటం సంచలనంగా మారింది.

డీమ్డ్ యూనివర్సిటీగా కొనసాగుతున్న యూనివర్సిటి గుర్తింపును వెంటనే రద్దు చేయాలంటూ ఎంపి తన ఫిర్యాదులో కోరారు. విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని గీతం విద్యాసంస్ధను ఆంధ్రా యూనివర్సిటికీ అఫిలియేట్ ఇప్పించాలని సూచించారు. యూనివర్సిటి గ్రాంట్స్ కమీషన్ నిబంధనలను ఉల్లంఘించి యాజమాన్యం డీమ్డ్ హోదా తెచ్చుకుందంటూ తీవ్రంగా ఆరోపించారు. ఇన్ని సంవత్సరాల్లో గీతం యాజమాన్యం పాల్పడిన అక్రమాలకు, తప్పుడు మార్గాలు అంటూ ఒక జాబితాను విజయసాయి తన ఫిర్యాదులో వివరంగా చెప్పారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే గీతం విద్యాసంస్ధల యాజమాన్యం చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితుడైన దివంగత ఎంఎల్సీ ఎంవివిఎస్ మూర్తి దన్న విషయం తెలిసిందే. మూర్తి మనవడు, నారా లోకేష్ తోడల్లుడైన శ్రీ భరత్ మొన్నటి ఎన్నికల్లో టీడీపీ తరపున విశాఖపట్నం ఎంపిగా పోటి చేసి ఓడిపోయారు.

గీతం భూకబ్జా వివాదం చివరకు రాజకీయంగా ఇటు వైసీపీ అటు టీడీపీ నేతల మధ్య మంటలు పుట్టిస్తోంది. గీతం వ్యవస్థాపకుడు ఉత్తరాంధ్రలోని సినియర్ నేతల్లో ఒకరు, పైగా చంద్రబాబుకు దగ్గరి బంధువు కావటంతో విజయసాయి కూడా గీతం యాజమాన్యం వెంట పట్టువదలని విక్రమార్కుడులాగ తగులుకున్నారు. దేశంలో పాపులర్ యూనివర్సిటీల్లో ఒకటిగా ఎదిగిన ఈ విద్యాసంస్థ గురించి ఎంపీ ఫిర్యాదు కేంద్రం లెక్కలోకి తీసుకుంటుందా… లేక ఉద్దేశపూర్వక ఆరోపణలు అంటూ పక్కన పెట్టేస్తుందా అన్నది చూడాలి.