వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యవహారం అందరికీ తెలిసిందే. ఆయనపై ఇప్పటికి మూడు కేసులు నమో దయ్యాయి. ప్రస్తుతం విజయవాడ జైల్లోనే ఉన్నారు. వచ్చే నెల 9వ తేదీ వరకు కూడా ఆయన జైల్లోనే ఉండనున్నారు. అంతేకా దు.. ప్రస్తుతం ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్ కూడా రద్దయింది. మరోవైపు.. భూకబ్జా కేసులోనూ ఆయనపై మరో పిటిషన్ దాఖలైంది. దీంతో పోలీసు కస్టడీకి వంశీని అప్పగించారు. దీంతో వంశీ ఏకంగా మూడు కేసుల్లో చిక్కుకున్నట్టు అయింది. అయితే.. వంశీ ఒక్కరేనా.. వైసీపీలో ఉన్నది అంటే.. కాదనే అంటున్నారు పరిశీలకులు.
ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు.. ఇప్పటి వరకు కేసులు ఎదుర్కొంటున్న మాజీ ఎంపీ నందిగం సురేష్, బోరుగడ్డ అనిల్ వంటి వారిని పక్కన పెడితే.. ఇకపై కేసులు నమోదయ్యేవారి జాబితా కూడా పెద్దదిగానే ఉందని తెలుస్తోంది. ఇలాంటి వారిలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి సహా.. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అసెంబ్లీలోనే బండ బూతులతో విరుచుకుపడినట్టుగా మాజీ మంత్రి అనిల్పై టీడీపీనాయకులు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అయితే.. నెల్లూరులో ఆయన చేసిన అరాచకాలపై టీడీపీ నాయకులు పెద్ద జాబితాతోనేరెడీ అవుతున్నట్టు తెలిసింది.
ఇక, కాకాని గోవర్ధన్ రెడ్డిపై ఇప్పటికే నాలుగు కేసులు నమోదయ్యాయి. మరో కీలక కేసును కూడా తిరగదోడేందుకు పోలీసులు రెడీ అయ్యారు. దీంతో అటు కాకాని, ఇటు అనిల్పై కేసులు ఒకటి తర్వాత ఒకటి నమోదు కావడం ఖాయమని తెలుస్తోంది. ఇదిలావుంటే.. గుంటూరు జిల్లాకు చెందిన వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు క్వార్ట్జ్ దోపిడీ వ్యవహారంపై ఎమ్మెల్యే, చీఫ్ విప్ ఆంజనేయులు తాజాగా పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతోపాటు వైసీపీ నాయకులపై ఆయన గతంలో పెట్టించిన కేసుల ఆధారంగా.. వారితోనేరివర్స్ కేసులు పెట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఒక్క బొల్లాపైనే కాకుండా..ఆయన కుమారుడు గిరి పైనా కేసులు నమోదయ్యే అవకాశంఉందని తెలుస్తోంది. ఇలా.. ఒక కేసు కాకుండా..కేసుల పరంపర మొదలు కానుందని సమాచారం. అదేవిధంగా నరసారావుపేట మాజీ ఎమ్మెల్యే వైసీపీ నాయకుడి పైనా కేసులు పెట్టేందుకు రంగం రెడీ అయింది. ఇటీవల ఔషధ దుకాణాలపై అధికారులు దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనకు చెందిన దుకాణాలపైనా దాడులు జరిగాయి. వీటిని గోప్యంగా ఉంచిన అధికారులు ప్రభుత్వం నుంచి సిగ్నల్ రాగానే ఆయనపైనా కేసులు నమోదు చేసేందుకు రెడీ అవుతున్నారు.