వంశీకి డబుల్ షాక్… రెండో బెయిల్ పిటిషన్ కొట్టివేత

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ మోహన్ కు శుక్రవారం డబుల్ షాక్ తగిలింది. దళిత యువకుడు కిడ్నాప్, బెదిరింపుల కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని వంశీ దాఖలు చేసుకున్న పిటిషన్ ను విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు కొట్టివేసింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో బెయిల్ ఇవ్వాలంటూ వంశీ దాఖలు చేసుకున్న పిటిషన్ ను కోర్టు గురువారం కొట్టివేసిన సంగతి తెలిసిందే. తాజాగా శక్రవారం ఈ కేసుతోనే లింకున్న రెండో కేసులోనూ వంశీ బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టివేయడంతో వంశీకి వరుస రోజుల్లోనే డబుల్ షాక్ తప్పలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

2019 ఎన్నికల్లో వైసీపీ గాలిని తట్టుకుని మరీ వంశీ గన్నవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల కారణంగా తనకు రాజకీయ ఓనమాలు నేర్పిన టీడీపీకి దూరం జరిగిన వంశీ… వైసీపీకి దగ్గరయ్యారు. నాటి సీఎం హోదాలో ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మెప్పు కోసం టీడీపీ అదినేత, ప్రస్తుత ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్ లపై అసభ్య పదజాలంతో విరుచుకుపడిన వంశీ… టీడీపీ శ్రేణుల ఆగ్రహానికి గరయ్యారు. ఒకానొక సందర్భంలో గన్నవరం టీడీపీ కార్యాలయంపై వంశీ తన అనుచరులను పంపి ధ్వంసం చేయించారన్న ఆరోపణలూ బలంగా వినిపించాయి. ఈ వ్యవహారంపైనే వంశీపై కేసు నమోదు కాగా… కేసును మాఫీ చేయించుకునేందుకు ప్లాన్ వేసి వంశీ అడ్డంగా బుక్కైైపోయారు.

కిడ్నాప్, బెదిరింపుల కేసులో బెయిల్ ఇవ్వాలంటూ వంశీ దాఖలు చేసిన పిటిషన్ పై శక్రవారం విజయవాడ ఎస్సీ,ఎస్టీ కోర్టు విచారణ చేపట్టింది. ఇప్పటికే ఈ కేసులో వంశీని పోలీసులు రిమాండ్ లోకి తీసుకుని దాదాపుగా వారం రోజుల పాట విచారణ చేపట్టారని, సదరు విచారణకు వంశీ పూర్తిగా సహకరించారని… ఈ నేపథ్యంలో ఈకేసులో కొత్తగా తెలిసే అంశాలేమీ లేవని ఆయన న్యాయవాదులు తెలిపారు. అంతేకాకుండా అనారోగ్య కారణాలను పరిగణనలోకి తీసుకుని వంశీకి బెయిల్ ఇవ్వాలని కోరారు. అయితే వంశీకి బెయిల్ ఇస్తే… కిడ్నాప్ అయిన దళిత యువకుడు సత్యవర్థన్ కు ప్రాణ హానీ ఉందని, ఈ కారణంగా వంశీకి బెయిల్ ఇవ్వవద్దని సత్యవర్థన్ న్యాయవాదులు కోరారు. ఇరు వాదనలు విన్న కోర్టు… వంశీ బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది.