టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శుక్రవారం తమిళనాడు రాజధాని చెన్నైలో పర్యటించారు. నగరంలోని ఐఐటీ మద్రాస్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు వెళ్లిన ఆయన…ఐఐటీ మద్రాస్ లో 35 నుంచి 40 శాతం దాకా విద్యార్థులు తెలుగు వారే ఉండటంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాకుండా యువతే భవిత అన్న మాటను మరోమారు ప్రస్తావించిన చంద్రబాబు… అక్కడి తెలుగు విద్యార్థుల హర్షధ్వానాల మధ్య తన ప్రసంగాన్ని కొంతసేపు తెలుగులోనే కొనసాగించారు.
1995లో తాను ఐటీ గురించి మాట్లాడానని చెప్పిన చంద్రబాబు… ఇప్పుడు 2025లో ఏఐ గురించి మాట్లాడుతున్నానని వ్యాఖ్యానించారు. నాడు ఐటీ కోసం హైటెక్ సిటీని కట్టానన్న చంద్రబాబు… ఇప్పుడు ఏఐ కోసం క్వాంటం వ్యాలీని అభివృద్ధి చేస్తున్నానని తెలిపారు. సాంకేతికత అప్ డేట్ అవుతున్నకొద్దీ మనమూ అప్ డేట్ కావాల్సిందేనని, లేదంటే వెనుకబడిపోతామని చంద్రబాబు అన్నారు. దేశంలోనే కాదు ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా తెలుగు వారే ఉన్నారని ఆయన అన్నారు. ఈ పరిణామం తనకు ఎంతో గర్వకారణంగా ఉందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఓ భారతీయుడిగా… ఓ తెలుగు వాడిగా విశ్వవ్యాప్తంగా తెలుగు వారు సత్తా చాటుతున్న వైనాన్ని చూస్తుంటే గర్వంగా ఉందన్నారు.
తమిళనాడు.. ప్రత్యేకించి చెన్నైలోని ఏ యూనివర్సిటీకి వెళ్లినా ఆయా వర్సిటీలో సగాన సగం మంది తెలుగు విద్యార్తులే ఉంటున్నారని చంద్రబాబు అన్నారు. మంచిగా చదువుకుని మంచి ఉద్యోగాలు చేసి… మాతృభూమి అభివృద్ధికి తోడ్పాటు అందించాలని ఆయన పిలుపునిచ్చారు. ఓ బలమైన రాజకీయ పార్టీ ఉన్నప్పుడు ఈ తరహా చర్యలు సర్వసాధారణంగా జరిగిపోతూ ఉంటాయన్న చంద్రబాబు… టీడీపీ నేతృత్వంలో ఇప్పుడు అదే పని చేస్తున్నామని తెలిపారు. విద్య, ఉద్యోగం తర్వాత పళ్లి చేసుకుని పిల్లలను కనాలని సూచించిన చంద్రబాబు కుటుంబ నియంత్రణను పక్కనపెట్టేయాలని సూచించారు. ఇక విద్యార్థుల నినాదాలను విన్న చంద్రబాబు…ఏపీలో పవన్ కల్యాణ్ బాగానే ఉన్నారు… బాలకృష్ణ కూడా బాగానే ఉన్నారు…ఎక్కడ చదువుతున్నా…మీ హీరోలను మరువరు కదా..మీ స్ఫూర్తిని అబినందిస్తన్నానని ఆయన అన్నారు.