ఈ ఎంపీపీ ఎన్నిక చాలా కాస్ట్లీ గురూ!

ఏపీలో గురువారం వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్న జిల్లా పరిషత్, మండల పరిషత్ చైర్మన్లు, సర్పంచ్ లు, ఉప సర్పంచ్ ల ఎన్నికలు జరుగుతున్నాయి. ఇతర జిల్లాల పరిస్థితి ఎలా ఉన్నా… తిరుపతి జిల్లా పరిధిలోని తిరుపతి రూరల్ ఎంపీపీ ఎన్నిక అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఎందుకంటే…ఈ ఎంపీపీ గతంలో వైసీపీకి దక్కగా… దానిని నిలబెట్టుకునేందుకు వైసీపీ నేతలు నేల విడిచి సాము చేస్తున్నారని చెప్పాలి. మెజారిటీ వైసీపీకే ఉండగా..ఎక్కడ ఎంపీటీసీలు జారీపోతారోనని. వారందరినీ ఏకంగా ముంబై, గోవాలకు తరలించి క్యాంపు నిర్వహిస్తోంది. వెరసి ఈ ఎంపీపీ ఎన్నిక రాష్ట్రంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికగా చెప్పుకోవాలి.

వైసీపీ అధికారంలో ఉండగా… 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఎంపీపీగా ఎన్నికయ్యారు. అయితే 2024 ఎన్నికల్లో చెవిరెడ్డి ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగగా… చంద్రగిరి నుంచి మోహత్ రెడ్డి పోటీ చేశారు. ఈ కారణంగా తిరుపతి రూరల్ ఎంపీపీ పదవికి మోహిత్ రాజీనామా చేశారు. ఫలితంగా ఖాళీగా ఉన్న ఈ ఎంపీపీ పదవిని భర్తీ చేసేందుకు గురువారం ఎన్నిక జరుగుతోంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా దక్కించుకోవాలని కూటమి యత్నిస్తున్న నేపథ్యంలో వైసీపీ అప్రమత్తమైంది.

ఎంపీపీ ఎన్నికకు షెడ్యూల్ విడుదల కాగానే.. వైసీపీ ఎంపీపీలను చెవిరెడ్డి వర్గం క్యాంపునకు తరలించింది. తిరుపతి రూరల్ లో వైసీపీకి 33 మంది ఎంపీటీసీలు ఉండగా.. వారిలో నమ్మకంగా ఉంటారన్న ఓ నలుగురు, ఐదుగురిని వదిలేసిన చెవిరెడ్డి.. మొత్తం 27 ఎంపీటీసీలను క్యాంపునకు తరలించింది. వీరిలో కొందరిని ముంబై తరలించగా… మరికొందరిని గోవా తరలించింది. వీరిలో కొందరు ఎంపీటీసీలు ఫ్యామిలీతో కలిసి క్యాంపునకు తరలివెళ్లారు. ఈ ఖర్చులన్నీ తడిసిమోపెడు అయినట్లుగా సమాచారం, ఇక ఎంపీపీ ఎన్నికకు సమయం దగ్గరపడగా.. గురువారం ఉదయం వారందరినీ విమానాల్లో తిరుపతి తరలించారు.