బాబు పథకం దేశానికే ఆదర్శం అయ్యింది!

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు విజనరీ నేతే. ఈ విషయాన్ని వైరి వర్గాలు ఎంత విమర్శించినా.. ఆ విమర్శల్లో పస లేదనే చెప్పాలి. ఎందుకంటే… అధికారంలో ఉండగా చంద్రబాబు అమలు చేసిన పథకాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలు అవుతున్నాయంటే… ఆయన విజనరీ కిందే లెక్క కదా. దేశానికి ముచ్చటగా మూడోసారి ప్రధాని అయిన నరేంద్ర మోదీ ఇప్పుడు చంద్రబాబు అమలు చేసిన పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. అంతేనా… ఆ పథకానికి చంద్రబాబు పెట్టిన పేరుతోనే మోదీ అమలు చేస్తున్నారు.

2014లో విభజిత ఏపీకి సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు… ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్ ను పురస్కరించుకుని వారి ఇళ్లల్లో సంబరాలు అంబరాన్నంటేలా రంజాన్ తోఫా పేరిట పండుగ సరుకులను అందజేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో హిందువులకు సంక్రాంతి కానుక, క్రైస్తవులకు క్రిస్మస్ కానుకలు అందించారు. ఈ పథకాలు జనాల్లోకి బాగా వెళ్లిపోయాయి. చేసేది చిన్న సాయమే అయినా కూడా సరిగ్గా పండుగల వేళ ఆర్థిక ఇబ్బందులతో ఏ ఒక్క కుటుంబం కూడా పండుగ సంబరాలకు దూరం కాకూడదన్న భావనతోనే చంద్రబాబు ఈ పథకాలకు రూపకల్పన చేశారు. పక్కాగా అమలు చేశారు.

తాజాగా ఏపీకి చంద్రబాబు మరోమారు సీఎం అయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో వచ్చే ఏడాది నుంచి ఈ పథకాలను అమలు చేసే దిశగా కూటమి సర్కారు కదులుతోంది. అయితే కేంద్రంలో అదికారంలో ఉన్న ఎన్డీఏ సర్కారు… చంద్రబాబు తరహాలోనే రంజాన్ తోఫాను దేశంలోని అన్ని ముస్లిం కుటుంబాలకు అందించేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా ఉన్న 32 లక్షల పేద ముస్లిం కుటుంబాలకు ఎన్డీఏ సర్కారు అందించనుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బుధవారం దేశ రాజధాని ఢిల్లీలో రంజాన్ తోఫా కిట్ల పంపిణీని ప్రారంభించనున్నారు. ఈ కిట్లలో పురుషుల, స్త్రీలకు దుస్తులు, సేమియా, ఖర్జూర, డ్రై ఫ్రూట్స్, చక్కెర తదితరాలను ఎన్డీఏ సర్కారు అందించనుంది.