మద్యం కుంభకోణం…దేశ రాజదాని డిల్లీలో ఆప్ సర్కాను కుప్పకూల్చేసింది. ఇటు తమిళనాడులో అదికార డీఎంకేను ఆత్మ రక్షణలో పడేసింది. ఈ రెంటికి మధ్య అదికారం నుంచి దిగిపోయిన ఏపీలో అధికారం కోల్పోయిన వైసీపీని నేరుగా బోను ఎక్కించేలానే ఉంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా… సోమవారం నాటి పార్లమెంటు సమావేశాల్లో భాగంగా టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చేసిన ప్రసంగం వింటే వైసీపీ త్వరలోనే పెను చిక్కులను ఎదుర్కోక తప్పదని చెప్పాలి. అంతేకాకుండా ఢిల్లీ లిక్కర్ స్కాంను మించిన అవినీతి ఏపీ లిక్కర్ దందాలో చోటుచేసుకుందన్న వాదనలకూ బలం చేకూరుతోంది.
నరసరావుపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న లావు… గతంలో 2019 ఎన్నికల్లో అదే స్థానం నుంచి వైసీపీ ఎంపీగా కొనసాగారు. అయితే 2024 ఎన్నికల్లో ఆయన వైసీపీని వీడి టీడీపీలో చేరారు. తాజాగా ఆయన వైసీపీ చేసిన లిక్కర్ స్కాం గురించిన వివరాలు వింటూ ఉంటే… ఇంత భారీ అవినీతి జరిగిందా? అని జనం ముక్కున వేలేసుకున్నారు. లావు చెప్పిన దాని ప్రకారం..ఏపీలో దశలవారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తామని హామీ ఇచ్చి వైసీపీ 2019లో అదికారం లోకి వచ్చింది. అదికారంలోకి వచ్చినంతనే ఆ హామీని పక్కనపెట్టి… రాష్ట్రంలో విచ్చలవిడి మద్యం అమ్మకాలకు తెర తీసింది. అప్పటికే ఉన్న లిక్కర్ తయారీ సంస్థలకు అదనంగా మరో 26 కంపెనీల లిక్కర్ ఉత్పత్తికి అనుమతి ఇచ్చేసింది.
పాత కంపెనీలతో పాటుగా కొత్త కంపెనీలతో సంప్రదింపులు జరిపిన నాటి వైసీపీ సర్కారు పెద్దలు… ఆయా సంస్థలు లిక్కర్ ఉత్పత్తి చేయకుండానే ముడుపులు ఇచ్చేలా వ్యూహం రచించింది. కొత్త బ్రాండ్ల పేరిట మద్యం ఉత్పత్తికి అనుమతులు ఇచ్చేసిన వెంటనే వాటి నుంచి రూ.2 వేల కోట్ల ముడుపులను సేకరించి… వాటిని జగన్ బంధువు సునీల్ రెడ్డి ద్వారా దుబాయికి పంపింది. ఇందుకోసం ఓ ఇన్ ఫ్రా కంపెనీనే ఏర్పాటు చేశారట. ఆ తర్వాత ఆయా కంపెనీలు నాసి రకం మద్యం ఉత్పత్తి చేసినా పట్టించుకోలేదట. ఈ స్కాంపై ఇఫ్పటికే సీఐడీ దర్యాప్తు జరుగుతోందన్న లావు.. ముడుపులు విదేశాలకు తరలిపోయిన నేపథ్యంలో ఈడీ కూడా ఈ కేసును దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.