దక్షిణాది రాష్ట్రాలకు జరిగే అన్యాయంలో కలిసి పోరాటం చేసేందుకు సిద్ధమన్న తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావులు అనుకున్నట్లుగానే ఒకే బాటలో సాగారు. రాజకీయంగా తమ మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టేశారు. దక్షిణాది రాష్ట్రాల డిమాండ్ ను ఒకరు వినిపిస్తే… మరొకరు దానికి దన్నుగా నిలిచి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ… అవసరం అయితే కలిసి పనిచేసేందుకు కూడా తాము వెనుకాడబోమని కూడా వారు తేల్చి చెప్పారు. ఈ అరుదైన ఘట్టానికి తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగిన డీలిమిటేషన్ పై జరిగిన భేటీ వేదికగా నిలిచింది.
జనాభా ప్రాతిపదికగా జరిగే నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని తమిళనాడు సీఎం, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్డీఏ సర్కారు చేపట్టే ఈ డీలిమిటేషన్ తో దేశంలో అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరగదని, దేశంలో విభేదాలకు ఆజ్యం పోసినట్టు అవుతుందని, ప్రత్యేకించి దక్షిణాదికి జాతీయ స్థాయిలో అసలు విలువే లేకుండా పోతుందన్నది స్టాలిన్ వాదన. ఈ వాదనకు బలం చేకూర్చే దిశగా దక్షిణాది రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీలతో కీలక బేటీని ఆయన శనివారం చెన్నైలో నిర్వహించారు. ఈ భేటీకి తెలంగాణ నుంచి అధికార కాంగ్రెస్ తో పాటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా హాజరైంది. ఈ రెండు పక్షాల తరఫున రేవంత్ రెడ్డి, కేటీఆర్ హాజరై అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.
అంతా అనుకున్నట్లుగానే స్టాలిన్ వాదనకు వత్తాసు పలికిన రేవంత్, కేటీఆర్ లు బేటీలోనూ ఒకే బాట, ఒకే మాటగా సాగారు. బేటీలో భాగంగా తొలుత రేవంత్ రెడ్డి తన వాదనను వినిపించారు. దేశ జీడీపీలో దక్షిణాది రాష్ట్రాలు 33 శాతాన్ని అందిస్తున్నాయని… అలాంటప్పుడు అంతే స్థాయిలో నిధులను ఎందుకు దక్షిణాదికి విడుదల చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. ఆ తర్వాత ప్రసంగించిన కేటీఆర్… రేవంత్ వాదనను సమర్థించారు. అది కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రతిపాదన నూటికి నూరు పాళ్లు సరైనదేనని కూడా ఆయన వ్యాఖ్యానించారు. జీడీపీలో 33 శాతం ఇస్తున్న దక్షిణాదికి 36 శాతం లోక్ సభ సీట్టు ఎందుకు ఇవ్వకూడదు అని ఆయన మరో ఆసక్తికర వాదనకు తెర తీశారు.