ఎన్నికల నిర్వహణపై క్లారిటి ఇచ్చేసిన సీఎస్

స్ధానిక సంస్ధల ఎన్నికలను నిర్వహించే పరిస్ధితి లేదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని స్పష్టంగా చెప్పేశారు. స్ధానిక సంస్ధల ఎన్నికలను నిర్వహించే విషయమై స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బుధవారం సాయంత్రం సీఎస్ తో భేటి అయ్యారు. ఈ సందర్భంగా నీలం మాట్లాడుతు ఎన్నికలను నిర్వహించ పరిస్ధితి రాష్ట్రంలో లేవని తేల్చి చెప్పేశారు. బుధవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు నిమ్మగడ్డ వివిధ రాజకీయపార్టీలతో ఇదే విషయమై సమావేశం అయిన విషయం అందరికీ తెలిసిందే.

పార్టీల ప్రతినిధులు చెప్పిన అభిప్రాయాలు తీసుకుని నిమ్మగడ్డ సాయంత్రం నీలంను కలిశారు. కరోనా వైరస్ వ్యాప్తి రాష్ట్రంలో ఇంకా నియంత్రణలోకి రాలేదని చెప్పారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో కరోనా వైరస్ కేసుల వివరాలను, నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. అలాగే ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులకు కరోనా వైరస్ సోకిందనే లెక్కలను కూడా నిమ్మగడ్డ ముందుంచారు. పనిలోపనిగా పోలీసుశాఖలో కరోనా వైరస్ సోకిన వారి వివరాలు, పోలీసులు నిర్వహిస్తున్న విధులను కూడా వివరించారు.

రాష్ట్రంలో ఇఫ్పటి వరకు నమోదైన కేసులు, అందిస్తున్న చికిత్సలు తదితర వివరాలను కూడా నిమ్మగడ్డకు నీలం వివరించినట్లు సమాచారం. రోజుకు సుమారు 4 వేల కేసులు నమోదవుతున్న ప్రస్తుత సమయంలో ఎన్నికలను నిర్వహించే పరిస్ధితుల్లో ప్రభుత్వం లేదన్నారు. కరోనా వైరస్ సమస్య అదుపులోకి రాగానే తామే కబురు చేస్తామని కూడా హామీ ఇచ్చారు. అంటే కరోనా అదుపులోకి వచ్చిన తర్వాత ఎన్నికల నిర్వహణ విషయమై మాట్లాడుకోవచ్చన్న విషయాన్ని సూటిగానే నీం చెప్పినట్లయ్యింది.

నీలంతో భేటి తర్వాత నిమ్మగడ్డ ఏమీ మాట్లాడకుండానే తన ఆఫీసుకు వెళ్ళిపోయారు. బహుశా ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన వస్తుందనే విషయంలో ముందే ఓ అవగాహన నిమ్మగడ్డకు ఉండే ఉంటుంది. అందుకనే నీలం చెప్పిందంతా ఓపిగ్గా విని వెళ్ళిపోయారు. మరి ఇపుడు నిమ్మగడ్డ ఏమి చేస్తారు ? అన్నదే సస్పెన్సుగా మారింది. బహుశా రాజకీయ పార్టీల అభిప్రాయాలు, ప్రధాన కార్యదర్శి చెప్పిన విషయాన్ని కోర్టుకు అఫిడవిట్ రూపంలో అందించే అవకాశాలున్నాయి. పనిలో పనిగా ఎన్నికల నిర్వహణపై ఎన్నికల కమీషన్ అభిప్రాయాన్ని కూడా చెబుతారు. మరి కోర్టు ఎలా స్పందిస్తుందనే విషయాన్ని చూడాలి.