టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ నుంచి వచ్చిన ఓ ప్రకటన ఈ సిసలైన రాజకీయం ఎలా ఉంటుందన్న విషయాన్ని విడమరచి మరీ చెప్పేసింది. ”ఎన్నికల వరకు మాత్రమే రాజకీయం… ఆ తర్వాత ప్రభుత్వం శాశ్వతం భావనతో సాగాలి. ఈ విషయాన్ని ఇప్పటికైనా గుర్తించండి జగన్”అంటూ లోకేశ్ కామెంట్ చేశారు. ఎంతో పరిణతి ఉంటే తప్పించి ఈ మాట రాదన్నది రాజకీయ విశ్లేషకుల మాట. సాదాసీదా రాజకీయాలు చేసే వారికి అసలు ఈ ఊహే తట్టదని కూడా వారు విశ్లేషిస్తున్నారు.
నిజమే… ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికల్లో విడుదలయ్యే ఫలితాలు ఓ సారి సిట్టింగ్ పార్టీకే పగ్గాలు ప్రభుత్వ పగ్గాలు దక్కితే… మరికొన్ని సార్లు అప్పటిదాకా విపక్షాలుగా కొనసాగిన పార్టీల చేతులకు ఆ పగ్గాలు దక్కుతాయి. ప్రభుత్వ పగ్గాలు పట్టుకునే పార్టీలు మారవచ్చు గానీ… ప్రభుత్వాలు అయితే మారవు కదా. ఈ విషయం అందరికీ తెలిసిందే అయినా గానీ… దానిని ఒప్పుకునేందుకు మాత్రం చాలా మంది సిద్ధపడరు. అది వారిలోని నారో మైండెడ్ నెస్ కు నిదర్శనమని చెప్పాలి. పార్టీలు మారినా ప్రభుత్వం మారదు కదా. అందుకే కదా…గత ప్రభుత్వం చేసిన అప్పులను ఆ తర్వాత వచ్చే పార్టీల ప్రభుత్వాలు చెల్లిస్తున్నాయి. గత పార్టీ ప్రభుత్వాలు పెండింగ్ పెట్టిన బిల్లులను ఆ తర్వాత వచ్చే పార్టీ ప్రభుత్వాలు చెల్లిస్తున్నాయి కదా.
శుక్రవారం కూడా ఏపీలో గత ఐధేళ్ల పాటు పాలన సాగించిన వైసీపీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు పెట్టి దిగిపోతే… ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు వాటిని చెల్లిస్తోంది. ఇప్పటికే తొలి విడత కింద రూ.788 కోట్లను కూటమి సర్కారు చెల్లించింది. తాజాగా శుక్రవారం ఈ బకాయిల్లో మరో రూ.600 కోట్లను విడుదల చేసింది. త్వరలోనే మరో రూ.400 కోట్లను విడుదల చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు లోకేశ్ ప్రకటించారు. ఈ సందర్భంగానే ఆయన ప్రభుత్వం, రాజకీయం… వాటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఎత్తి చూపుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ తరహాలో ముందుకు సాగే నేతలు తిరుగు లేని నేతలుగా ఎదిగి తీరుతారని గత అనుభవాలు చెబుతూనే ఉన్నాయి. ఆ దిశగానే లోకేశ్ కూడా పయనిస్తున్నారని చెప్పక తప్పదు.