సంచైత తీరుపై నెటిజన్లు భగ్గు

మాన్సాస్ ట్రస్టు ఛైర్ పర్సన్ సంచైతా గజపతిరాజు వ్యవహారం వివాదంగా మారింది. రెండు రోజుల క్రితం ముగిసిన పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవాల్లో సంచైత వ్యవహరించిన తీరుపై నెటిజన్లు భగ్గుమని మండిపోతున్నారు. ఆమెతీరు చూస్తుంటే అధికారంలోకి రాగానే తన నిజ స్వరూపం బయటపెట్టుకుందంటు నిర్మొహమాటంగా సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

ఇంతకీ విషయం ఏమిటంటే సిరిమాను ముగింపు ఉత్సవాన్ని చూడటం కోసం ఆనంద గజపతిరాజు రెండోభార్య సుధా గజపతిరాజు, కూతురు ఊర్మిళా గజపతిరాజు విజయనగరంలోని కోటలోకి వచ్చారు. కోట పైన ఉన్న బురుజు మీద తల్లీ, కూతుళ్ళిద్దరు కూర్చున్నారు. అంటే వీళ్ళతో పాటు పోలీసులు అధికారులు, మాన్సాస్ ట్రస్టు సిబ్బంది కూడా ఉన్నారులేండి. మరి కొద్దిసేపటిలో ఉత్సవం కోట ముందుకు చేరుకుంటునుకునే సమయంలో సంచైతా గజపతి రాజు కూడా కోట పై భాగానికి చేరుకున్నారు.

కోటపైకి చేరుకోగానే అందరితో పాటు సుధా, ఊర్మిళను చూసిన తర్వాత సంచైత మొహం మాడిపోయిందట. వెంటనే వీళ్ళద్దరినీ కోటపైకి రానిచ్చిన పోలీసులపై నోటికొచ్చినట్లు విరుచుకుపడిపోయారట. దాంతో విషయం అర్ధం చేసుకున్న తల్లీ, కూతుళ్ళిద్దరు కాసేపటి తర్వాత అక్కడి నుండి బయటకు వచ్చేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మాన్సాస్ ట్రస్టు ఛైర్ పర్సన్ గా అపాయింట్ కావటానికి ముందు పూసపాటి వంశీయురాలిగా , గజపతి రాజుల వారుసురాలిగా గుర్తింపు కోసం సంచైత పోరాటం చేసిన విషయం తెలిసిందే.

ఇదే విధమైన వారసత్వం కోసం ఆనంద్ రెండో భార్య సుధా, ఊర్మిళా గజపతిరాజులు కూడా ఇఫుడు పోరాటం చేస్తున్నారు. తన హక్కుల కోసం, వారుసురాలిగా గుర్తింపుకోసం అశోక్ గజపతిరాజుల పై పోరాటం చేసి వైసీపీ ప్రభుత్వం సాయంతోనే సంచైత సాధించుకున్నారు. మరి ఇదే విధమైన పోరాటం చేస్తున్న సవతి తల్లి, సవతి సోదరిపైన మాత్రం ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకుంటున్నారు. ఇక్కడే సంచైత వైఖరిపై నెటిజన్లు మండిపోతున్నారు. కోట మీద తమకు జరిగిన అవమానాన్ని స్వయంగా ఊర్మిళా గజపతిరాజే తన ట్విట్టర్ ద్వారా బయటపెట్టారు. దాంతో నెటిజన్లుల సంచైతను ఓ రేంజిలో ఆటాడుకుంటున్నారు.