స‌ల‌హాదారులు కావ‌లెను.. బోర్డు పెట్టిన జ‌గ‌న్‌?

వైసీపీ ఇప్పుడున్న ప‌రిస్థితి నుంచి పైలేవాలంటే.. ఖ‌చ్చితంగా పార్టీని పూర్తిగా జీరో నుంచే మొద‌లు పెట్టాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. 2012లో ఎక్క‌డ ఎలా పార్టీకి అంకురార్ప‌ణ జ‌రిగిందో ఇప్పుడు అదే రేంజ్‌లో పార్టీని వ్య‌వ‌స్థీకృత ద‌శ నుంచి అభివృద్ధి చేసుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. వాస్త‌వానికి 2019లో 151 మంది ఎమ్మెల్యేల‌ను గెలిపించుకున్న త‌ర్వాత‌.. పార్టీ నిర్మాణంపై జ‌గ‌న్ పెద్ద‌గా దృష్టి పెట్ట‌లేదు. పైగా.. వ‌లంటీర్ల‌ను న‌మ్ముకుని కార్య‌క‌ర్త‌ల‌ను వ‌దులుకున్నారు.

ఇది 2024 ఎన్నిక‌ల్లో తీవ్ర ప్ర‌భావం చూపించింది. నిజానికి టీడీపీతో స‌మానంగా వైసీపీకి ఒక‌ప్పుడు క్షేత్ర స్థాయిలో కార్య‌క‌ర్త‌లు ఉన్నారు. జెండా మోసేవాళ్లే కాదు.. జెండా క‌ట్టుకునేవారు కూడా ఉన్నారు. అలాంటి పార్టీని జ‌గ‌న్ త‌న వ్య‌క్తిగ‌త నిర్ణ‌యాలు.. అహంకార ధోర‌ణుల కార‌ణంగా.. పార్టీని రోడ్డున ప‌డేశార‌న్న వాద‌న ఉంది. అందుకే.. చాలా మంది కీల‌క నాయ‌కులు.. ఏకంగాజ‌గ‌న్‌కు ద‌గ్గ‌ర బంధువులు కూడా పార్టీకి రాం రాం చెప్పారు. పొరుగు పార్టీల్లో కండువాలు క‌ప్పుకొన్నారు.

ఈ నేప‌థ్యంలో ఇప్పుడు వైసీపీకి నాయ‌కులు లేకుండా పోయారు. ఎక్క‌డ ఏధ‌ర్నా చేయాల‌న్నా.. ఏ నిర‌సన తెల‌పాల‌న్నా.. ఆ న‌లుగురు మాత్ర‌మే క‌నిపిస్తున్నార‌న్న విధంగా పార్టీ ప‌రిస్థితి మారిపోయింది. దీంతో అస‌లు నిర‌స‌న‌లు, నిర్ణ‌యాలు కూడా వాయిదా ప‌డుతున్నాయి. ఇటీవ‌ల ఫీజు రీయింబ‌ర్స్‌మెంటుపై నిర‌స‌న‌కు పిలుపునిచ్చి కూడా.. వెన‌క్కి తీసుకున్నారు. అదేస‌మ‌యంలో ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఏ కార్య‌క్ర‌మం చేయాల‌న్నా.. ముందు పార్టీలో నుంచే స్పంద‌న కొర‌వ‌డుతోంది.

ఇది నిష్ఠుర స‌త్యం. ఇలాంటి కీల‌క స‌మ‌యంలో ఉన్న పార్టీ నుంచి.. మ‌రింత మంది నాయ‌కులు జంప్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్ర‌మంలో పార్టీని గాడిలో పెట్టేందుకు.. కార్య‌క‌ర్త‌ల‌ను త‌యారు చేసుకునేందుకు మాజీ సీఎం జ‌గ‌న్ త‌హ‌త‌హ‌లాడుతున్నారు. పైగా.. త‌న‌కు స‌ల‌హాలు ఇచ్చేవారు కూడా ఇప్పుడు లేకుండా పోయారు. ఈ క్ర‌మంలో కొత్త‌గా స‌ల‌హాదారుల కోసం అన్వేషిస్తున్న‌ట్టు పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది. ఐఐటీ నిపుణుల కోసం.. ముఖ్యంగా పాలిటిక్స్ అంటే ఆస‌క్తి ఉన్న మేధావుల కోసం వైసీపీ వెతుకుతున్న‌ట్టు స‌మాచారం.