ఏపీ సీఎం చంద్రబాబుకు మరో కీలకమైన వ్యవహారం కత్తిమీద సాముగా మారనుంది. ఇప్పటి వరకు పాలన వేరు.. ఆమోదించిన బిల్లులు.. తెచ్చుకున్న గ్రాంట్లు వేరు. కానీ, ఇప్పుడు కీలకమైన వక్ఫ్ బోర్డు బిల్లుకు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. తాజాగా గురువారం ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదికను సభ ఆమోదించిన విషయం తెలిసిందే.
దీనిపై మాల సామాజిక వర్గం ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ.. సర్కారు తరఫున సీఎం చంద్రబాబు స్వయం ఆ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలతో చర్చలు జరిపి.. ప్రస్తుతానికి ఒప్పించారు. మొత్తానికి బిల్లుకు సభ ఆమోదం తెలిపేలా వ్యవహరించారు. ప్రస్తుతం రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకుని ఎస్సీ వర్గీకరణ నివేదిక చెప్పినట్టుగా రెల్లి సామాజిక వర్గానికి 1 శాతం, మాదిగ సామాజికవర్గానికి, ఉప కులాలకు 6.5 శాతం, మాల సామాజిక వర్గానికి, ఉప కులాలకు 7.5 శాతం చొప్పున రిజర్వేషన్లు అమలు చేయనున్నారు.
అయితే.. 2026లో జనాభా గణన పూర్తయ్యాక.. జిల్లాలను ఒక యూనిట్గా తీసుకుని.. రిజర్వేషన్లను అమలు చేయనున్నట్టు చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇది.. కొంత వరకు పూర్తయింది. కానీ, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న సభలోనే వక్ఫ్ బిల్లు రానుంది. ఇది కేంద్రం రాష్ట్రాలకు ప్రతిపాదించిన బిల్లు. ఇప్పటికే పార్లమెంటులో ఆందోళనల మధ్య ఆమోదం పొందిన ఈ బిల్లును రాష్ట్రాలు కూడా ఆమోదించాల్సి ఉంటుంది. కర్ణాటకలో ఈ బిల్లును ఏకపక్షంగా తిరస్కరించారు.
తమిళనాడులోనూ, పశ్చిమ బెంగాల్లోనూ అసెంబ్లీలు వక్ఫ్ చట్టం సవరణ(2024) బిల్లును తిరస్కరించాయి. ఇప్పుడు ఏపీ వంతు వచ్చింది. ఇది అనుకున్నంత ఈజీ కాదు. ఇప్పటి వరకు వక్ఫ్ ఆస్తులపై ఉన్న అధికారాలు.. ముస్లిం వక్ఫ్ బోర్డులు కోల్పోతాయి. పైగా ఈ వివాదాలకు సంబంధించి.. స్థానిక కోర్టులను ఆశ్రయించే అవకాశం లేదు. దీంతో వక్ఫ్ సవరణ బిల్లు విషయంలో ముస్లింలు ఆగ్రహంతో ఉన్నారు. రాష్ట్రంలో కర్నూలు, గుంటూరు, కడప జిల్లాలు.. ముస్లింలకు ఆలవాలంగా మారిన నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం ఈ బిల్లును ఏం చేస్తుందన్నది ఆసక్తిగా మారింది.