గుమ్మడి నర్సయ్య.. వామపక్ష పార్టీగా అంతగా గుర్తింపే లేని సీపీఐ న్యూ డెమొక్రసీ పార్టీ నుంచి ఏకంగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కమ్యూనిస్టు నేత. కమ్యూనిస్టులకు మంచి పట్టున్న ఇల్లెందు నియోజకవర్గం నుంచి వరుసగా ఎన్నికల్లో గెలిచిన నర్సయ్య తెలుగు నేల ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో ఎమ్మెల్యేగా కొనసాగారు. అయితే ఆ తర్వాత ఆయనతో పాటు ఆయన పార్టీ కూడా ఆధునిక రాజకీయాల్లో మరింతగా రాణించలేకపోయాయి. ఏదో సమస్య కోసం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు చాలాకాలంగా యత్నిస్తున్న నర్సయ్య కల మంగళవారం నెరవేరింది.
తన నియోజకవర్గం గురించి సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడేందుకు నర్సయ్య పలుమార్లు సీఎంఓను సంప్రదించారట. అయితే అధికారులు ఎప్పటికప్పుడు ఆయనను ఏమారుస్తూ వచ్చారట. దీంతో ఆ మధ్య ఒకానొక రోజు రేవంత్ ఇంటి వద్దకు వచ్చిన నర్సయ్య… సీఎం రేవంత్ తనను చూసి అయినా ఆగుతారేమోనని సీఎం ఇంటికి ఎదురుగా రోడ్డుపైనే నిలుచున్నారు. అయితే సీఎం దృష్టిలో ఆయన పడలేకపోయారు. ఫలితంగా సహనం నశించిన నర్సయ్య… ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనకే సీఎం దర్శన భాగ్యం కలగకపోతే ఇక సామాన్యుడి పరిస్థితి ఏమిటంటూ ఆయన వాపోయారు. ఆ తర్వాత ఏం జరిగిందో గానీ… నర్సయ్య హైదరాబాద్ లో కనిపించనే లేదు.
అసెంబ్లీలో రెండు రోజుల క్రితం నర్సయ్య అంశాన్ని సీపీఐ సభ్యుడు కూనంనేని సాంబశివరావు ప్రస్తావించారు. దీంతో వెనువెంటనే ప్రతిస్పందించిన రేవంత్ రెడ్డి… సీఎంగా నిత్యం బిజీగా ఉండే తనకు రోడ్డుపై నిలుచున్న నర్సయ్యను గుర్తించేదెలా? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు తనను సచివాలయంలో కలవొచ్చని తెలిపారు. వారానికి నాలుగు రోజుల పాటు ప్రజాప్రతినిధులను కలుస్తానని తెలిపారు. నర్సయ్య విషయం తెలిసినంతనే తానే ఆయనకు స్వయంగా ఫోన్ చేశానని రేవంత్ తెలిపారు. అయితే అప్పటికే ఖమ్మం వెళ్లిపోయానని నర్సయ్య తలిపారని… ఈ దఫా హైదరాబాద్ కు రాగానే కలుస్తానని చెప్పారని కూడా రేవంత్ తెలిపారు.
తాజాగా మంగళవారం సీఎం రేవంత్ రెడ్డితో నర్సయ్య భేటీ అయ్యారు. సీఎం కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో తన సమస్యను ఆయన ఓ వినతి పత్రం రూపంలో రేవంత్ కు తెలియజేశారు. సీఎం కూడా దానిని పరిశీలించి పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం. దీంతో నర్సయ్య ఒకింత శాంతించారనే చెప్పాలి. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా… ఏనాడూ ఆడంబరాలకు వెళ్లని నర్సయ్య… సాదాసీదా జీవనాన్నే సాగించారు. అసెంబ్లీకి ఎమ్మెల్యే హోదాలో ఆయన ఆటోలోనే వచ్చేవారు. ఇల్లెందు నుంచి హైదరాబాద్ కు ఆయన బస్సు, రైలులో మాత్రమే ప్రయాణించేవారు. ఇక ఎమ్మెల్యేగా తనకొచ్చే వేతనాన్ని పార్టీకి ఇచ్చేసి… పార్టీ ఇచ్చే తన గౌరవ వేతనంతో మాత్రమే నర్సయ్య తన జీవనాన్ని సాగించి.. ఆదర్శంగా నిలిచారు.