రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలపై ఆశలు వదిలేసుకుందా ?

భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం, కేంద్రప్రభుత్వ వైఖరి చూస్తుంటే ఏపిలో బీజేపి ఎదుగుదలపై నమ్మకం లేనట్లే కనిపిస్తోంది. ఆంధ్రుల జీవనాడిగా ప్రచారంలో ఉన్న పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్రప్రభుత్వం అడిగినట్లుగా నిధులు ఇచ్చేది లేదని కేంద్రం కుండబద్దలు కొట్టినట్లు చెప్పటంతో అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. విచిత్రమేమిటంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి మాత్రమే నిధులిస్తామని కేంద్రం స్పష్టం చేయటం. అంటే ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ ఖర్చు, భూములు కోల్పోయిన వారికి ఇవ్వాల్సిన నష్టపరిహారం, పునరావాస ప్యాకేజీ ఖర్చుల్లో దేన్నీ కేంద్రం భరించదట.

ఒక చోట ప్రాజెక్టు కడుతున్నారంటే భూసేకరణ, నష్టపరిహారం, పునరావాస ప్యాకేజీ లాంటివన్నీ కలుపుకునే ప్రాజెక్టు వ్యయాన్ని లెక్క కడతారు. పైన చెప్పుకున్న లెక్కలన్నీ ఎప్పుడో కట్టినవే. లెక్కలు కట్టినపుడు కేంద్రం అంగీకరించింది కూడా. అయితే తాజాగా పైన చెప్పిన కేంద్రం షరుతులు ఇపుడు బయటపడ్డాయి. సమాచార హక్కు చట్టం క్రింద ఓ కార్యకర్త రాబట్టిన సమాచారం ప్రకారం ప్రాజెక్టు ఖర్చు మాత్రమే భరిస్తామని కేంద్రం చెప్పింది.

పోలవరం ప్రాజెక్టుకు పెండింగ్ లో ఉన్న రూ. 2234 కోట్లు మాత్రమే ఇవ్వాలని కేంద్రం డిసైడ్ అయిపోయింది. ఇదే కేంద్రం ఫైనల్ డెసిషన్ అయితే మాత్రం ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తికాదన్న విషయం అర్ధమైపోతోంది. మరపుడు రాష్ట్రప్రభుత్వం ఏమి చేస్తుందన్నది వేరే విషయం. అయితే పార్టీగా మాత్రం బీజేపీ నెత్తిన పిడుగు పడినట్లే. ఇప్పటికే విభజన చట్టంలోని హామీలను తుంగలో తొక్కిన ఫలితంగా బీజేపీ ఏపిని దారుణంగా దెబ్బ తీసేసింది.

2014 రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్రానికి ప్రత్యేకహోదా, విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ లాంటి అనేక హామీలను బీజేపీ తుంగలో తొక్కేసింది. ఎన్నికల్లో అన్నింటినీ నెరవేరుస్తామని హామీ ఇచ్చిన నరేంద్రమోడి ప్రధానమంత్రి కాగానే మాట దాటేశారు. ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదు. దాని ఫలితమే 2019 ఎన్నికల్లో పార్టీకి వచ్చిన 0.84 శాతం ఓట్లు. ఇపుడు తాజాగా మొదలైన వివాదాన్ని గనుక కేంద్రం పరిష్కరించకపోతే భవిష్యత్తులో బీజేపీకి ఏపిలో ఎక్కడ కూడా డిపాజిట్లు కూడా వచ్చే అవకాశాలు లేవు. అలాగే విషయాన్ని దాచిపెట్టి జనాలను మభ్యపెట్టిన టీడీపీకి కూడా భవిష్యత్తు గడ్డుకాలమే.