ఓ వైపేమో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అధికారంలో ఉంటే… విపక్షాలు సైతం తమ కార్యక్రమాలను ఘనంగా చేసుకుంటాయి. భారీ ఏర్పాట్లు చేసుకున్నా బాబు సర్కారు అంతగా పట్టించుకోదు. సరే… వారేదో సంబరాలు చేసుకుంటున్నారు కదా. వారి సంతోషాన్ని మనమెందుకు తగ్గించాలి? అన్నట్లుగా సాగుతుంది. అంటే.. అధికారంలో ఉన్నా గానీ చంద్రబాబు సహనంతో సాగుతారు.
అదే వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే… వైరి వర్గాలు సంబరాలే చేసుకోకూడదు అన్నట్లుగా పరిస్థితి ఉంటుంది. ఆ సంబరాల్లో నిబంధనలు అతిక్రమించారంటూ ఉన్నపళంగా ఆంక్షల కత్తులను బయటకు తీసి.. ఆ సంబరాలను కాస్తా నిరసనలుగా మార్చేస్తుంది. అంటే… అధికారంలో ఉంటే జగన్ లో సహనం అన్నదే కనిపించదు. ఈ ఇద్దరి వైఖరులకు అద్దం పట్టేలా ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
అసలు విషయంలోకి వెళితే… నేడు జగన్ గుంటూరు జిల్లాలోని తెనాలికి వెళుతున్నారు. తెనాలి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత అన్నాబత్తుని శివకుమార్ కుమారుడి పెళ్లి సోమవారం జరుగుతోందట. ఈ వేడుకకు జగన్ హాజరవుతున్నారు. ఈ క్రమంలో తెనాలి పట్టణంతో పాటుగా తెనాలికి దారి తీసే మార్గం జగన్ ఫ్లెక్సీలు, పోస్టర్లతో నిండిపోయింది. అదేదో వైసీపీ ఆవిర్భావ సభ నిర్వహిస్తున్నట్లుగా రహదారి నిండా జగన్, వైసీపీ బ్యానర్లే కనిపిస్తున్నాయి.
సరే.. మొన్నటి ఎన్నికల్లో కనీసం ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కనంతగా జగన్ దిగజారగా… ఎంతైనా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన నేత కదా అన్న భావనతో ఈ బ్యానర్లు, ఫ్లెక్సీల ఏర్పాటుపై అటు కూటమి సర్కారు, ఇటు అధికార యంత్రాంగం పెద్దగా పట్టించుకోలేదు. సహనంతోనే సాగిపోతోందన్న మాట. ప్రస్తుతం తెనాలి ఎమ్మెల్యేగా జనసేన నేత, మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
సరే… వైసీపీ అధికారంలో ఉండగా 2022లో ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలు కేంద్రంగా టీడీపీ మహానాడు వేడుకలు జరిగిన సంగతి తెలిసిందే. ఏటా మూడు రోజుల పాటు మహానాడు పేరిట పార్టీ ఆవిర్భావ వేడుకలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా 2022లో ఒంగోలులో మహానాడును నిర్వహించారు. ఈ సందర్భంగా ఒంగోలు నగరంతో పాటు నగర పరిసరాలన్నీ దాదాపుగా పసుపు మయం అయిపోయాయి.
అయితే నాడు అధికారంలో ఉన్న వైసీపీ సర్కారు ఆంక్షల కత్తులను బయటకు తీసింది. నిబంధనల పేరిట మునిసిపల్ అధికారులు రంగంలోకి దిగి చాలా ప్రాంతాల్లో టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలు, బ్యానర్లను తొలగించింది. ఈ పరిణామంపై నాడు టీడీపీ నిరసన వ్యక్తం చేసినా పెద్దగా పట్టించుకున్న దాఖలానే కనిపించలేదు. విపక్షంలో ఉన్న పార్టీలు ఆవిర్భావ వేడుకలు కూడా నిర్వహించుకోవడానికి వీల్లేదా అంటూ టీడీపీ నేతలు చేసిన వాదనలు అరణ్య రోదనగానే మిగిలిపోయాయి.