ఢిల్లీలో రేవంత్ ఆ ‘గుట్టు’ కూడా విప్పారా..?

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ల పై విపక్షం బీఆర్ఎస్ గగ్గోలు పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాను ఢిల్లీకి వెళ్లిన మాట వాస్తవమేనన్న రేవంత్… ఇంకా చాలా సార్లు… ఇంకా చెప్పాలంటే వందల సార్లు వెళతా అంటూ శనివారం నాటి అసెంబ్లీ సాక్షిగానే సంచలన ప్రకటన చేశారు. అయినా ఢిల్లీ వెళుతున్నది తానేదో గోటీలు ఆడటానికి కాదు కదా అన్న రేవంత్… కేంద్ర మంత్రులను, ప్రధానిని కలుస్తున్నానని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల మేరకే తాను ఢిల్లీ వెళుతున్నానన్న రేవంత్… తాను ఢిల్లీలో కలవని మంత్రి లేరంటూ చెప్పారు. అంటే…రాష్ట్రానికి నిధులతో ఎలాంటి సంబంధం లేని మంత్రులతోనూ ఆయన భేటీ అవుతున్నానని తేల్చేశారు. ఈ టూర్లలో నిధులతో పాటుగా ఓ కీలక గుట్టును కూడా రేవంత్ విప్పినట్లుగా విశ్లేషణలు సాగుతున్నాయి.

ఇటీవలే దుబాయిలో టాలీవుడ్ కు చెందిన కేదార్ మృతి చెందిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో ఓ రెండు, మూడు సినిమాలను నిర్మించిన కేదార్… టాలీవుడ్ ప్రముఖులతో అత్యంత సన్నిహితంగా ఉంటున్నట్లు ప్రచారం సాగుతోంది. అదే సమయంలో బీఆర్ఎస్ కు చెందిన పలువురు కీలక నేతలతోనూ ఆయనకు ఆర్థిక సంబంధాలు ఉన్నాయని, అందులో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో ఆయనకు సంబంధాలున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. సినీ ప్రముఖులు, రాజకీయ నేతల వద్ద పెద్ద ఎత్తున నిధులను సేకరించిన కేదార్.. వాటిని ఆయా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్లుగా కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తమ గుట్టు ఎక్కడ బయటపడుతుందోనన్న భావనతో కేదార్ అంత్యక్రియలు అక్కడే జరిగినట్లు స్వయంగా రేవంతే ఆరోపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో కేదార్ మృతి వెనుక దాగి ఉన్న గుట్టును రేవంత్ విప్పేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా రేవంత్ శనివారం నాటి అసెంబ్లీలో ప్రకటించారు కూడా. తన ఢిల్లీ టూర్లలో ఇతర మంత్రులతో పాటు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తోనూ ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేదార్ మృతికి దారి తీసిన కారణాలు… ఆ మరణం వెనుక ఉన్న వారెవరు?.. కేదార్ అంత్యక్రియలు అక్కడే జరగడానికి గల కారణాలు మొత్తాన్ని జైశంకర్ సాయంతో రేవంత్… దుబాయి నుంచి సేకరించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వివరాలను సమయం వచ్చినప్పుడు బయటపెడతానన్న రేవంత్… అందులో ఏముందన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. దీంతో ఢిల్లీలో రేవంత్ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలతో పాటుగా తెలంగాణలో జరుగుతున్న కీలక విషయాలను కూడా రాబట్టే దిశగా కీలక అడుగులు వేస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది.