వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇప్పుడు వార్తల్లో వ్యక్తిగా మారిపోయారు. తన తొలి భార్యతో వేరు పడి దివ్వెల మాధురితో కలిసి తిరుగుతున్న దువ్వాడ ఏం చేసినా.. ఇట్టే వైరల్ అయిపోతోంది. కుటుంబ తగాదాలను పరిష్కరించుకునే పని ఎంత వరకు వచ్చిందో తెలియదు గానీ.. మాధురితో కలిసి ఆయన చెట్టాపట్టాలేసుకుని తిరుతున్న వైనం కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది. మాధురితో కలిసి దువ్వాడ శనివారం హైదరాబాద్ లో ప్రత్యక్షమయ్యారు. మాధురితో కలిసి శ్రీనివాస్ వకుళ సిల్క్స్ పేరిట ఓ పట్టు చీరల షోరూమ్ ను ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి సంబంధించిన వీడియోలు ఇఫ్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి.
హైదరాబాద్ లోని మియాపూర్, మదీన గూడ పరిధిలో మాధురి, శ్రీనివాస్ లు వకుళ సిల్క్స్ పేరిట పట్టు చీరల షోరూమ్ ను ఏర్పాటు చేయగా… శనివారం ఆ షోరూమ్ ను ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రారంభించింది. ఈ సందర్భంగా నల్లటి సూటు బూటులో శ్రీనివాస్ మెరిసిపోయారనే చెప్పాలి. ఇక షోరూమ్ ఎంత రిచ్ గా ఉంటుందన్న విషయాన్ని మాధురి తన అలంకరణతోనే చెప్పేశారని చెప్పాలి. షోరూమ్ ఓపెనింగ్ తర్వాత మాధురి, శ్రీనివాస్ ల మధ్య కూర్చుని నిధి అగర్వాల్ మాట్లాడిన బైట్లు మరింతగా ఆకట్టుకుంటున్నాయి.
వైసీపీకి సంబంధించి శ్రీకాకుళం జిల్లాలో దువ్వాడ శ్రీనివాస్ కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలోని టెక్కలి కేంద్రంగా రాజకీయం చేస్తున్న దువ్వాడ.. కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఎప్పటికైనా ప్రత్యక్ష ఎన్నికల్లో విజయం సాధించాలన్న కసితో సాగుతున్న దువ్వాడ… 2009 నుంచి ప్రయత్నిస్తున్నా ఇప్పటిదాకా సక్సెస్ కాలేకపోయారు. మధ్యలో కాంగ్రెస్ ను వీడి ప్రజారాజ్యంలో చేరిన ఆయన.. ఆ తర్వాత వైసీపీలో చేరారు. టెక్కలి నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోగా.. శ్రీకాకుళం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి కూడా ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీ నుంచి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీటును దక్కించుకున్న ఆయన.. 2027 మార్చి 29 వరకు ఆ పదవిలో కొనసాగనున్నారు.