నియోజకవర్గాల పునర్విభజన అంశం.. దేశవ్యాప్తంగా చర్చగా మారిన విషయం తెలిసిందే. దీనిపై తమిళ నాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కేంద్రంలోని మోడీ సర్కారు దక్షిణాది రాష్ట్రాలను మరింత వెనక్కి నెట్టే ఉద్దేశంతోనే డీ లిమిటేషన్ను తీసుకువస్తోందని.. ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ సారథి.. కిషన్ రెడ్డి స్పందించారు.
డీలిమిటేషన్ ప్రక్రియ కొత్తది కాదన్నారు. ఇది కాంగ్రెస్ హయాంలో 2009లోనే తీసుకువచ్చిన ప్రక్రియగా పేర్కొన్నారు. అప్పటి విధానాలనే ఇప్పుడు కూడా అనుసరిస్తున్నట్టు చెప్పారు. దీనిలో ఒక్క పాయింట్ను కూడా తాము కొత్తగా చేర్చింది లేదన్నారు. అయినప్పటికీ.. తమపై ఏదో ఒకటి అనాలన్న ఉద్దేశంతో ఇప్పుడు యాగీ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. డిలిమిటేషన్ ప్రక్రియ వల్ల తెలంగాణకు కానీ.. తమిళనాడు, ఏపీ,కర్ణాటకలకు కానీ.. ఎలాంటి అన్యాయం జరగబోదని తెలిపారు.
“నియోజకవర్గాల పునర్విభజన అనేది నిరంతర ప్రక్రియ. దీనిపై ఎందుకు ఇలా యాగీ చేస్తున్నారో తెలి యదు. కానీ,ఇది కాంగ్రెస్ హయాం నుంచే అమల్లో ఉన్న విధానం. దీనినే మేం కొనసాగిస్తున్నాం. దీని వల్ల ఏ రాష్ట్ర ప్రయోజనాలు కూడా దెబ్బతినే పరిస్థితిలేదు. కాబట్టి.. ఎవరూ వీరి మాయమాటలు నమ్మొద్దు” అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అంతేకాదు.. తమిళనాడు సీఎం స్టాలిన్ తాను చేసింది చెప్పుకొనే దమ్ము లేక.. హిందీపై పడ్డారని విమర్శించారు. త్రిభాషా సూత్రం పాటిస్తే.. తప్పేంటన్నారు.
తమిళనాడు సినిమాలను హిందీలోకి డబ్బింగ్ చేసి.. కోట్ల రూపాయలను ఆర్జిస్తున్నది నిజం కాదా? దీనికి స్టాలిన్ ఏం సమాధానం చెబుతారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. హిందీని తాము బలవంతంగా రుద్దు తున్నట్టు ప్రచారం చేస్తున్నారని, కానీ.. ఇది తప్పన్నారు. ఎవరికి నచ్చిన భాషను వారు ఎంచుకునే స్వేచ్ఛ దేశంలోని ప్రతి పౌరుడికి ఉందన్నారు. కానీ, స్టాలిన్ వచ్చే ఏడాది ఎన్నికల్లో తాను చేసింది చెప్పుకొని ఓట్లు అడిగే పరిస్థితి లేనందున హిందీని వాడుకుంటున్నారని దుయ్యబట్టారు.