18 మంది ఉగ్రవాదుల జాబితాను ప్రకటించిన కేంద్రం

పొరుగునే ఉన్న దాయాది దేశం పాకిస్ధాన్ తో మనకు ఎదురవుతున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. 24 గంటలూ, 365 రోజులు మనదేశంలోకి ఉగ్రవాదులను పంపటం, మన దేశానికి వ్యతిరేకంగా తీవ్రవాదులను తయారు చేయటమే పనిగా పెట్టుకున్నది పాకిస్ధాన్. నిజానికి మనదేశంలో అల్లకల్లోలం సృష్టించాలని చేస్తున్న ప్రయత్నాలు, శ్రద్ధలో సగం తమ దేశం అభివృద్ధి విషయంలో పెట్టున్నా ఈపాటికి పాకిస్ధాన్ బాగానే అభివృద్ధి జరిగుండేదనటంలో సందేహం లేదు.

తాజాగా 18 మందితో ఓ ఉగ్రవాదుల జాబితాను కేంద్రప్రభుత్వం ప్రకటించింది. వీళ్ళల్లో హిజ్ బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్ తో పాటు ఇండియన్ ముజాహిదీన్ కు చెందిన భత్కల్ సోదరులు కూడా ఉన్నారు. ముంబాయ్ లో జరిగిన మారణహోమానికి కారకుడైన సాజిద్ మీర్, లష్కరే కమాండర్ యుసుఫ్ ముజమ్మిల్, అబ్దుర్ రహ్మాన్ మక్కీ, ఇబ్రహీం అథార్, యూసుఫ్ హజర్, ఛోటా షకీల్ ఈ జాబితాలో ఉన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం క్రింద ఈ జాబితాను కేంద్రం ప్రకటించింది.

జాబితాలో పై పేర్లతో పాటు షాహిద్ మహమ్మద్, ఫర్హుతుల్లా ఘోరీ, అబ్దుల్ రౌఫ్ అస్గర్, ఇబ్రహీం అత్తార్, షాహిద్ లతీష్, సయ్యద్ యూసుఫ్ షా, గులాంనబీ ఖాన్, జాఫర్ హస్సేన్ భట్, రియాజ్ ఇస్మాయిల్ ఫాబాద్రీ, ఇబ్రహీం మీనన్ కూడా ఉన్నారు. వీరంతా నేరుగా పాకిస్ధాన్లో కూర్చునో లేకపోతే అవసరమైనపుడు జమ్మూ-కాశ్మీర్ లోకి వచ్చి తమ మద్దతుదారులకు బాధ్యతలను అప్పగించి వెళ్ళిపోవటమే చేస్తున్నారు.

ఇప్పటికే చాలా అంతర్జాతీయ వేదికలపై పాకిస్ధాన్ అమలు చేస్తున్న ఉగ్రవాద కార్యకలాపాల గురించి మన ప్రభుత్వం ఆధారాలతో సహా నిరూపించిన విషయం తెలిసిందే. అయితే పాకిస్ధాన్ మాత్రం భారత్ లో జరుగుతున్న మారణహోమాని తనకు ఎటువంటి సంబంధం లేదని బుకాయిస్తునే ఉంది. అంతర్జాతీయంగా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహిం చాలా సంవత్సరాలుగా పాకిస్ధాన్ లోనే ఉన్నాడంటూ మనదేశం ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.