ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత.. చెప్పిన మాటను నిలబెట్టుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ప్రతి నెలా 3వ శనివారాన్ని పురస్కరించుకుని.. ‘స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు తణుకులో పాల్గొన్నారు. ఇక, మంత్రుల విషయానికి వస్తే.. మంత్రి నారా లోకేష్ మంగళగిరిలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇతర మంత్రులు సైతం తమ తమ నియోజకవర్గాల్లో పాల్గొన్నారు.
తణుకులో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్వర్ణాంధ్ర-స్వ చ్ఛాంధ్ర తన జీవిత ఆశయాలని చెప్పారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని తానే తొలిసారి ప్రారంభించానని చెప్పారు. కేంద్రంలోని మోడీ సర్కారుకు కూడా తాను స్వచ్ఛ భారత్
కు బ్లూ ప్రింట్ నేనే ఇచ్చానని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోనే కాకుండా.. దేశంలోనూ స్వచ్ఛ కార్యక్రమాలు జరుగుతున్నాయని అంటే.. అది తాను చూపిస్తున్న శ్రధ్ధేనని చెప్పారు. రాష్ట్రం బాగుంటే.. దేశం బాగుంటుందన్నారు.
కేన్సర్ నివారణకు తాను అధిక ప్రాధాన్యం ఇస్తున్నానని చంద్రబాబు చెప్పారు. తన అత్తగారు.. బసవ తారకం కేన్సర్ కారణంగానే చనిపోయారని, అందుకే.. ఎన్టీఆర్ కేన్సర్ ఆసుపత్రికి శ్రీకారం చుట్టారని, వేలాది మంది రోగులకు ప్రాణభిక్ష పెడుతున్నారని తెలిపారు. సింగిల్ యూజ్(ఒకేసారి వినియోగించి పారేసేవి) ప్లాస్టిక్ను నిరోధించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైనా ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ క్రమంలో అరటి చెట్ల ద్వారా గ్లాసుల తయారీని ప్రోత్సహిస్తున్నామన్నారు.
మంగళగిరిలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్.. రహదారులు శుభ్రపరిచి అందరికీ ఆదర్శంగా నిలిచారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయాలని సూచించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నిరోధించేందుకు.. కూడా సమాజం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛంద సంస్థలు సైతం దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి నెల మూడో శనివారం.. రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామని.. దీనిలో మహిళలు, చిన్నారులు సైతం పాలుపంచుకుంటున్నారని తెలిపారు.